చిన్నకోడూరు(సిద్దిపేట): క్రీడల ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆత్యాపాత్యా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముకేష్, చైర్మన్ జంగిటి శ్రీనివాస్లు అన్నారు. చిన్నకోడూరు ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఆత్యా పాత్యా క్రీడలు ఆదివారం ఉత్సాహభరితంగా సాగాయి. వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడమే ఆత్యా పాత్యా లక్ష్యమన్నారు. క్రీడల ద్వారా యువతలో మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. క్రీడా స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సభ్యులు మహేశ్, వెంకట్రెడ్డి, రాజు, కనకారెడ్డి, రజిత, రజినీ, రవీందర్రెడ్డి తదితరులు ఉన్నారు.
గజ్వేల్రూరల్: కౌలు రైతులను గుర్తించే వరకు సంఘటితంగా ఉద్యమిస్తామని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని అంబేడ్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం కౌలు రైతులను గుర్తిస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. కౌలు రైతులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి రైతు భరోసా, పంట నష్ట పరిహారం చెల్లించాలని, ఎలాంటి షరతులు లేకుండా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, యూరియా సరఫరాకు ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏగొండస్వామి, జిల్లా అధ్యక్షుడు బ్యాగరి వేణు, మండల అధ్యక్షుడు చంద్రం, కౌలు రైతులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్
సిద్దిపేటజోన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ప్రక్రియలో ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సూచించారు. ఆదివారం పట్టణంలో హెల్ప్ డెస్క్ లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సర్’ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అందుబాటులో ఉండని సూపర్ వైజర్లు, వార్డు ఆఫీసర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పనిసరి విధులకు హాజరుకావాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సర్ ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ, సేకరణ, ఆన్లైన్ ప్రక్రియ గూర్చి సమీక్షించారు.
మాజీ మంత్రి హరీశ్రావు
పటాన్చెరు టౌన్: సర్ ప్రక్రియపై పార్టీ నాయకులు, ఆశావహులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందని.. స్కామ్ల ప్రభుత్వం పోయి మళ్లీ సంక్షేమ పథకాల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎస్ఐఆర్, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అంశాలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధ్యక్షతన జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మాజీమంత్రి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసి యావత్తు మీ వైపు చూసేలా చేశారన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కారణంగా ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగి ఎన్నికల ఫలితాలు మారాయని ఆరోపించారు.


