గజ్వేల్రూరల్: వ్యక్తి అదృశ్యమై.. శవమై కనిపించిన ఘటన పట్టణ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గజ్వేల్ పట్టణంలోని వినాయక్నగర్లో తన చిన్నకొడుకు బాబు వద్ద ఉంటున్న రాయపోల్కు చెందిన పంబాల చిన్నబాల్రాజు(75)కు మతిస్థిమితం సరిగా లేకపోగా, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 8న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం పట్టణ శివారులోని జాలిగామ రోడ్డు.. ఎస్ఎల్ఎన్ ఫంక్షన్హాల్ ప్రాంతంలో గల రైల్వేట్రాక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఘటనా స్థలానికి వెళ్లి చిన్నబాల్రాజుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గుర్తు తెలియని వ్యక్తి..
మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పట్టణ సీఐ మహేశ్ వివరాల ప్రకారం.. మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే, సమాచారం తెలిసినట్లయితే మెదక్ పట్టణ పోలీసులను 87126 57878, 87125 76101లో సంప్రదించాలని తెలిపారు.
మృతుడి ఆచూకీ లభ్యం
సిద్దిపేటఅర్బన్: కారు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనలో మృతుడి ఆచూకీ లభ్యమైంది. సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నాందేవ్ గులాబ్ నవాథే (46) కొన్నేళ్లుగా హోటళ్లలో పని చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రోడ్డు దాటుతుండగా కరీంనగర్ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుతూ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నాందేవ్ తీవ్రగాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి కుమారుడు నాందేవ్ నవాథే ఫిర్యాదు మేరకు పోలీసులు కారు డ్రైవర్ సాయికృష్ణపై కేసు నమోదు చేశారు.


