సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్
మద్దూరు(హుస్నాబాద్): బైరాన్పల్లి అమరుల త్యాగాలను వృథా కానివ్వమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం 78వ వారోత్సవాల్లో భాగంగా బుధవారం బైరాన్పల్లిలో బురుజు వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అందె అశోక్ మాట్లాడుతూ.. దోపిడీకి వ్యతిరేకంగా బైరాన్పల్లి ప్రజలు సాగించిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు. 118 మంది అమరులైన బైరాన్పల్లి నెత్తుటి చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పోరాటాన్ని గుర్తించి స్మృతి చిహ్నాలు, అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కన్వీనర్ నర్సింహాచారి, మండల కార్యదర్శి యాదగిరి, నాయకులు సంపత్, మల్లేశ్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.


