పటాన్చెరు టౌన్: క్యాబ్ డ్రైవర్ అదృశ్యమైన మూడు రోజులకే దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్న్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా.. పాతర్ల పాడుకు చెందిన రాజశేఖర్(32) కొంతకాలంగా హైదరాబాద్లోని రసూల్పుర సీబీఎన్ నగర్లో నివాసముంటున్నాడు. కాగా లీలను ప్రేమించి వివాహం చేసుకున్న ఆయనకు శ్రీనిధి, అనన్య అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సొంత కారు ఉన్న రాజశేఖర్ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగులను తీసుకెళ్లేందుకు లీజుకు పెట్టాడు. ఈ నెల 10న రాత్రి విధులకు వెళ్లిన అతడు ఇంటికి వచ్చి భోజనం చేసి తిరిగి బయటకు వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోహిర్ గోల్డెన్ దాబా వద్ద కారు
సంగారెడ్డి జిల్లా.. కోహిర్లోని గోల్డెన్ దాబా వద్ద రాజశేఖర్ కారు ఉన్నట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. మార్గమధ్యలో రుద్రారం శివారులోని జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఓవర్ బ్రిడ్జి సమీపంలో చెట్ల పొదల్లో రాజశేఖర్ మృతదేహం ఉన్నట్లు శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు గుర్తించారు. మృతుడి మెడకు బెల్టు లాంటి వస్తువుతో బిగించిన ఆనవాళ్లతోపాటు తల, ముఖంపై తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో కొంతమంది ఉన్నట్లు టోల్గేట్ వద్ద లభించిన సమాచారం, మొబైల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పలువురు క్యాబ్ డ్రైవర్లను పటాన్చెరు పోలీస్స్టేషన్న్లో విచారించినట్లు తెలిసింది. మృతుడి సోదరుడు రాంబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రుద్రారం శివారులో మృతదేహం లభ్యం
గొంతు నులిమి, తీవ్రంగా కొట్టినట్లు ఆనవాళ్లు


