పటాన్చెరు టౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు జిజ్ఞాస స్టూడెంట్ రీసెర్చ్ ప్రాజెక్టుల్లో రాష్ట్రస్థాయి అవార్డులు సాధించారు. శుక్రవారం కళాశాలలో విజయోత్సవ సభ నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయ రంగంపై అంతర్రాష్ట్ర వలస శ్రామికుల ప్రభావంపై చేసిన పరిశోధనకు అర్థశాస్త్రంలో ప్రథమ బహుమతి, ఫుడ్ అడల్టరేషన్ పై చేసిన ప్రాజెక్టుకు వృక్షశాస్త్రంలో ద్వితీయ బహుమతి, ఇంగ్లిష్ స్కిల్స్పై పరిశోధనకు ఆంగ్లంలో తృతీయ బహుమతి లభించాయి. ఈ సందర్భంగా అవార్డులు సాధించిన విద్యార్థులు, ప్రొఫెసర్ వెంకటేశం,డాక్టర్ మల్లిక, డాక్టర్ షరీఫ్ మియాలను ప్రిన్సి పాల్ ప్రవీణ, అధ్యాపకుల బృందం అభినందించారు. అనంతరం ఎండీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో విద్యార్థులు, సిబ్బందికి మట్టి గణపతులను పంపిణీ చేసి పర్యావరణంపై అవగాహన కల్పించారు.
నర్సాపూర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు..
నర్సాపూర్ రూరల్: రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీల్లో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన జంతు శాస్త్ర విభాగం విద్యార్థులు ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి అందుకున్నారు. రాష్ట్ర కమిషనరేట్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిజ్ఞాస పరిశోధన ప్రాజెక్టు పోటీలు నిర్వహించారు. కాగా నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర విభాగం విద్యార్థులు హబీ టాట్ అండ్ ది నర్సాపూర్ ఫారెస్ట్, తెలంగాణ అనే పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఆయా రకాల పక్షులపై చేసిన పరిశోధనకు మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు అధ్యాపకుడు డాక్టర్ సురేశ్ను కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.


