కొండపాక(గజ్వేల్): బీజీ– 3 పత్తి విత్తనాలు అధికంగా సాగు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి హెచ్చరించారు. మండలంలోని రవీంద్రనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కాటన్ సాగు విషయంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ బీజీ 3 కాటన్ విత్తనాల సాగు వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయన్నారు. అధిక శాతం విత్తనాలు వాడితే ఆరోగ్యపరమైన సమస్యలు, పర్యావరణ ప్రభావం, నేల, నీరు కాలుష్యం వంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా వివిధ రకాల పంటలను సాగు చేసుకోవల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు పత్తి పంటను పరిశీలించి తెగుళ్ల నివారణకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బాబూనాయక్, ఏఓ శివరామకృష్ణ, సర్పంచ్ కవిత, ఏఈఓలు రమ్యశ్రీ, సుష్మిత, మౌనిక, సాత్విక, రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయ పరిశోధన కేంద్రం
శాస్త్రవేత్త పల్లవి


