ఆదర్శ ప్రధానోపాధ్యాయుడిగా వెంకటరాజయ్య
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలోని కంది మండలం చెర్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా వెంకటరాజయ్య పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నాలుగేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణతను సాధించడంలో విశేష కృషి చేశారు. దీని ఫలితంగానే గతేడాది జిల్లాలో ప్రథమ, ద్వితీయ రెండు ర్యాంకులు కూడా చెర్యాల పాఠశాలకే లభించాయి. గతేడాది ట్రిపుల్ ఐటీకి ఆరుగురు విద్యార్థులు ఎంపిక కాగా ఈసారి ఏకంగా 22 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఒకే పాఠశాల నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎంపిక కావడం మొదటిసారి కావడం విశేషం. చెర్యాల పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు ఎన్ఎంఎంఎస్కు ఎంపికయ్యారు. వీరికి ఏడాదికి రూ.12,500 ఉపకార వేతనంగా వస్తుంది.
ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో..
వెంకటరాజయ్య విద్యా బుద్ధులు నేర్పిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత హోదాలో పని చేస్తున్నారు. సోమక్కపేటలో ఉపాధ్యాయుడిగా విద్యను బోధించిన సమయంలో ఆ గ్రామ విద్యార్థి బి.వెంకటేశం శనివారం సంగారెడ్డి జిల్లాలో భానూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా, జెడ్పీహెచ్ఎస్ చండూర్ విద్యార్థి అనిల్కుమార్ బిహార్లోని ఆర్మీ మెడికల్ కళాశాలలో ఫ్రొఫెసర్గా, పెద్దశంకర్ పేట విద్యార్థి మునిపల్లి మండలంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పోతరాజు భాస్కర్తోపాటు సుమారుగా 17మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు ఆదిలక్ష్మీకి తన గురువు వెంకటరాజయ్య కంటే ముందుగానే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గతేడాది ఎంపికయ్యారు.


