నేడు కలెక్టరేట్లో అవార్డుల ప్రదానం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ వంద మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. వీరందరికీ శనివారం కలెక్టరేట్లో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల విభాగంలో తొమ్మిది మంది, స్కూల్ అసిస్టెంట్ గణితం విభాగంలో 10 మంది, ఫిజికల్ సైన్స్ విభాగంలో 10 మంది, బయోసైన్స్ విభాగంలో ఐదుగురు, సోషల్ స్టడీస్ విభాగంలో ఆరుగురు, ఇంగ్లిషు విభాగంలో ఆరుగురు, తెలుగు విభాగంలో నలుగురు, హిందీ విభాగంలో నలుగురు, పీజీ సీఆర్టీ నర్సింగ్ కేటగిరీలో ఒకరు, పీఈటీ కేటగిరీలో తొమ్మిదిమంది, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం కేటగిరీలో ఒకరు, సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో 35 మంది ఉపాధ్యాయులు ఎంపికై నట్లు జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు.
మఠం కీర్తి చంద్రికకు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
హత్నూర(సంగారెడ్డి): జిల్లాలోని హత్నూర మండలం దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న కీర్తి చంద్రికను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. తెలంగాణ స్టేట్ రిసోర్స్ పర్సన్గా, వర్క్ బుక్ రైటర్గా ఎంతోమంది విద్యార్థులను గణితం అంటే ఇంత సులభమా అనే విధంగా ల్యాబ్ను ఏర్పాటు చేసి సులభమైన పద్ధతిలో విద్యాబోధన అందిస్తూ జిల్లాలో ఆదర్శంగా నిలిచారు. ఎస్సీఈఆర్టీ ప్రచురించిన ‘‘ప్రయోగ దీపిక –గణిత ప్రయోగశాల మాన్యువల్’’వివిధ అభ్యాసన పుస్తకాల రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించారు. దౌల్తాబాద్ పాఠశాలలో తక్కువ ఖర్చు, ఖర్చు లేని బోధనా అభ్యసనా సామగ్రితో ఓ గణిత ప్రయోగశాలను ఏర్పాటు చేశారు.
గుణాత్మక విద్యకు దాతల
సహకారం కోసం సమన్వయం
సామాజిక విద్యా కార్యక్రమాల్లో భాగంగా కీర్తి చంద్రిక విశేష కృషి చేశారు. డీఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి సహకారంతో బేసిక్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఆక్వేషన్ ప్రోగ్రాం ద్వారా 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రాథమిక గణిత నైపుణ్యాల వర్క్బుక్లను ఉచితంగా అందించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేశారు. ఆమె సమర్థవంతమైన బోధన, మెటీరియల్స్ సమన్వయంతో పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా అత్యుత్తమ మార్కులు సాధించడం విశేషం.


