పేదలకు కుట్టులో శిక్షణ
జహీరాబాద్ టౌన్: మహిళల ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవడం కోసం వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సర్వీసెస్(వికాస్) సంస్థ చేయూతనిస్తోంది. పేదలను గుర్తించి వారికి కుటుల్టో శిక్షణ తరగతులు నిర్వహించి ఉచితంగా మెషీన్లు పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు శిక్షణ తరగతుల ద్వారా 1,170 మంది మహిళలకు మెషీన్లు అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న మరో 370 మందికి త్వరలోనే మెషీన్ల పంపిణీ చేయనుంది. ఐటీఐ విద్యార్థులకు కూడా నైపుణ్యంపై ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించి వారికి కూడా అవసరం మేరకు టూల్స్ పంపిణీ చేశారు.
కోల్ ఇండియా సహకారంతో..
జహీరాబాద్ పట్టణానికి చెందిన బీఎంఎస్ జాతీయ నాయకులు కొత్తకాపు లక్ష్మారెడ్డి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సర్వీసెస్(వికాస్) సంస్థను కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. సంస్థ ద్వారా జహీరాబాద్ ప్రాంతం వారికి మేలు జరగాలని అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పేద మహిళలకు స్వయం ఉపాధి మార్గం చూపాలన్న ఉద్దేశ్యంతో కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ సహకారంతో మహిళా సశక్తీకరణ –నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుటుబం పోషణకు మహిళల పాత్ర కీలకమని గ్రహించి వారికి కుట్టులో శిక్షణ ఇప్పించి విలువైన మెషీన్లు ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించారు.
నియోజకవర్గం అంతటా శిక్షణ తరగతులు
జహీరాబాద్ పట్టణంతోపాటు నియోజకవర్గం అంతటా ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కోక్క కేంద్రంలో సుమారు 60 మంది వరకు మహిళలకు ట్రైనర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. మూడు నెలల శిక్షణ తర్వాత ఉచితంగా కుట్టు మెషీన్లు పంపిణీ చేస్తుంటారు. వికాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివ్ కౌన్సిల్ అధికారులు కూడా పరిశీలించి నిర్వహకులను అభినందించారు.
ఉచితంగా 1,170 మెషీన్ల పంపిణీ
మరో 370 మెషీన్ల పంపిణీకి సిద్ధం


