నారాయణఖేడ్: ఖేడ్ మండలం జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో ఇంటర్లో వివిధ కోర్సుల్లో ఉన్న ఖాళీలకు ఈనెల 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసచారి తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో 15, బైపీసీలో 15 సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ ఖాళీ సీట్లను జోనల్ అధికారి ఉత్తర్వుల మేరకు నేరుగా భర్తీ చేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఒరిజనల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
సంగారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షానికి సంతలో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పట్టణంలోని పోతిరెడ్డిపల్లి, శాంతినగర్, బృందావన్ కాలనీ, గీతానగర్, మార్చ్నగర్ తదితర కాలనీల్లో రోడ్లపై నీరు చేరడంతో ద్విచక్ర వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్అండ్బీ కార్యాలయం నుంచి రైతు బజార్ వరకు డ్రైనేజీ పొంగి ప్రధాన రోడ్డుపై చేరడంతో ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
దుబ్బాకటౌన్: బుద్ధుడు, పూలే, అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ అందించిన సేవలకే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింహులుకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక గౌతమ బుద్ధ అవార్డు లభించిందని మహిళా కమిషన్ సభ్యురాలు శ్వేత తెలిపారు. జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ముత్యాల నర్సింహులుకు ఆదివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత, బీఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉప్పర మల్లేశం, జిల్లా అధ్యక్షుడు శంకర్ బోధి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...బుద్ధుడు బోధించిన కరుణ, సమానత్వం, అహింస, మానవత్వం వంటి విలువలను ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పించేందుకు ముత్యాల నర్సింహులు ఎన్నో ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి, పూలమాలలు వేసి, జ్ఞాపికను అందజేశారు.
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ భవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పీఆర్సీ నివేదిక వెంటనే తెప్పించుకుని 40% ఫిట్మెంట్తో వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన నూతన పీఆర్సీని ఆర్థిక ఇబ్బందులు సాకుతో వాయిదా వేయడం సరికాదన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సంక్షేమ కార్యక్రమాలు రూ.వేల కోట్ల తో కొనసాగేవా అని ప్రశ్నించారు. ప్రభుత్వం 27 వేల పాఠశాలలను 4 వేల పాఠశాలలకు కుదించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. హామీలు నెరవేర్చక పొతే ఉపాధ్యాయులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.


