వట్పల్లి(అందోల్): మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులకు సరైన ధరలు దక్కేలా చర్యలు తీసుకోవడంతో పాటు మార్కెట్యార్డులో సదుపాయాలు కల్పించడానికి మార్కెట్ కమిటీలు పనిచేస్తాయి. దీనిలో భాగంగానే 2024 అక్టోబర్లో వట్పల్లి మార్కెట్యార్డు నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. యార్డులో నెలకొన్న పలు సమస్యలు, అభివృద్ధి పనుల నిర్వహణపై దృష్టి సారించి పాలకవర్గ సమావేశం నిర్వహించి తీర్మానించారు. ఆ తర్వాత పాలకవర్గం మరో ఐదు సమావేశాలు నిర్వహించినప్పటికీ అవే సమస్యలు, అవే తీర్మానాలపై చర్చించారు తప్ప కొత్తగా చేసిందేమిలేదని, తీర్మానించిన ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి అడుగుపడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి దామోదర మార్కెట్ యార్డు ఆవరణలో పోలీస్స్టేషన్, తహసీల్దారు, ఎంపీడీఓ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించి స్థలాన్ని పరిశీలించి ఖరారు చేయడంతో దీనిపై ఈ నెల 24న పాలకవర్గం సమావేశమై తీర్మానించింది. అలాగే ఇతర అభివృద్ధి పనుల నిర్వహణపై చర్చించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా పదవీకాలం మూడు నెలలు మాత్రమే ఉందని.. ఇప్పటికే అభివృద్ధి పనులపై చేసిన తీర్మానాలు అమలుకు నోచుకోలేదని సమావేశానికి ముందు సభ్యులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం అక్టోబర్లో ముగియనుంది.
నిధులు మంజూరైనా.. పనులు సున్నా
మార్కెట్యార్డు ఆవరణలో పలు అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం సుమారు రూ.71 లక్షల నిధులను గతేడాది జూలైలో మంజూరు చేసింది. ఆరు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ.43 లక్షలు, ఆర్వో ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్కు రూ. 8 లక్షలు, కంపౌండ్ వాలుకు రూ.20 లక్షల నిధులు మంజూరు కాగా టెండర్లను కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు.
బీటలు వారుతున్న కార్యాలయం
మార్కెట్ కార్యాలయంలో ఎక్కడ చూసినా బీటలు వారి పెచ్చులూడిన గోడలు కనిపిస్తున్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్న్, కార్యదర్శి చాంబర్లో టైల్స్ కుంగిపోయి అధ్వానంగా తయారయ్యాయి. మార్కెట్ కార్యాలయానికి వచ్చేవారు కుంగిన బండలను చూసి కూర్చీలపై కూర్చోకుండా దూరంగా ఉంటున్నారు. విధుల నిర్వహణలో కార్యాలయ సిబ్బంది కూడా పగిలిన టైల్స్, బీటలు వాలిన గోడలను చూసి జంకుతున్నారు. ప్రస్తుతం టైల్స్ రిపేర్ పనులు జరుగుతున్నాయి.
తీర్మానాలకే వట్పల్లి మార్కెట్ కమిటీ పరిమితం


