● నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులు, క్లినిక్లు సీజ్ ● రెండు ఆర్ఎంపీ క్లినిక్లపై కేసులకు ఆదేశాలు
పటాన్చెరు టౌన్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై జిల్లా వైద్యారోగ్య శాఖ ఉక్కుపాదం మోపింది. డీఎంహెచ్ఓ లలితాదేవి ఆధ్వర్యంలో బుధవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పటాన్ చెరు మండలం, భానూర్ గ్రామంలోని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, క్లినిక్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇస్నాపూర్లోని వీకేర్ మీనాక్షి ఆస్పత్రిలో గర్భిణులకు సంబంధించిన ఫామ్–ఎఫ్ రికార్డులను నిబంధనల మేరకు నిర్వహించకపోవడాన్ని గుర్తించిన అధికారులు సంబంధిత స్కానింగ్ గదిని సీజ్ చేశారు. అదేవిధంగా అనుమతులు లేకుండా కొనసాగుతున్న రెండు ఆర్ఎంపీ క్లినిక్లను సీజ్ చేసి, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. భానూర్లోని సన్ షూర్ క్లినిక్, అపోలో డయగ్నొస్టిక్స్లో నిబంధనల ఉల్లంఘన వెలుగుచూడడంతో వాటిని సీజ్ చేశారు. యోగిరాజ్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ క్లినిక్లో గుర్తించిన లోపాలపై నోటీసు జారీ చేయడంతో పాటు జరిమానా విధించారు.


