ఎండలకు వాడి పోతున్న పత్తి మొలకలు జిల్లావ్యాప్తంగా అంచనా వేసిన ప్రణాళిక 7,62,580 గత నెలలో తక్కువ వర్షపాతం నమోదైన మండలాలు 24
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే దిశగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రైతులకు నష్టం వాటిల్లకుండా తక్కువ నీటి లభ్యతతో సాగు చేసే ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు పంటలు సాగు చేయని ప్రాంతాల్లో మూడు దశల్లో పంటలు సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
15 రోజులుగా ముఖం చాటేసిన వర్షాలు
సంగారెడ్డి జోన్: ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 7,62,580 ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశాలున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే పలుచోట్ల వివిధ రకాల పంటలు సాగు చేశారు. అయితే వర్షాలు లేకపోవడంతో వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. కంది, కుసుమ, నువ్వులు వంటి చిరుధాన్యాలతో పా టు కూరగాయల పంటలపై దృష్టి పెట్టారు.
మూడు దశల్లో ప్రణాళికలు
ఎల్నినో ప్రభావంతో మూడు దశల్లో కంటింజెన్సీ ప్రణాళికలు సిద్ధం చేశారు. వర్షపాతం పరిస్థితులను బట్టి ఈ నెల 15 వరకు మొదటి, 15 నుంచి 30 వరకు రెండో ప్రణాళిక, 30 నుంచి ఆగస్టు 15 వరకు మూడో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేయనున్నారు. ఆయా తేదీల్లోపు కురిసిన వర్షపాతం ఆధారంగా పంటల ప్రణాళిక అమలు చేస్తారు.
సదస్సుల ద్వారా అవగాహన
వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించిన ప్రణాళికలను అమలు చేసేందుకు గ్రామాల వారీ గా సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు కలిసి గ్రామాల్లో సభలు నిర్వహించే అవకాశాలు న్నాయి. తక్కువ నీటితో సాగు చేసే పంటల తోపాటు తక్కువ సమయంలో అధిక దిగుబడులు ఇచ్చే పంట రకాలపై అవగాహన కల్పిస్తారు. భూ సారం పెంపొందించడం, ఆరోగ్యానికి మేలు చేసే పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలను ప్రోత్సహిస్తారు.


