బాక్సుల్లో భవితవ్యం
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ బుధవారం ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వీరి నిరీక్షణకు శుక్రవారం తెరపడనుంది.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలు తలపడ్డాయి. ఎన్నికల సరళిని పరిశీలిస్తే.. రెండు, మూడు మున్సిపాలిటీలు మినహా దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఒకటీ రెండు సీట్ల తేడాతో సరిసమానంగా వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కాంగ్రెస్ పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ.. సంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు ఏమాత్రం తీసిపోని విధంగా గట్టి పోటీనిచ్చినట్లు పోలింగ్ సరళిని బట్టి నిపుణులు అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లో ఈ రెండు పార్టీలు చెరో రెండు చొప్పున మున్సిపాలిటీలను కై వసం చేసుకునే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపాలిటీలు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ రెండు బల్దియాల్లో బీఆర్ఎస్కు కాంగ్రెస్ కంటే కౌన్సిలర్ స్థానాలు కాస్త తగ్గే అవకాశాలున్నాయి. ఇక పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో మూడు మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో కొన్ని స్థానాల్లో సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. జహీరాబాద్, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో ఎంఐఎంకు కొన్ని స్థానాలు కై వసం చేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని చోట్ల స్వతంత్రులు గెలిచే అవకాశాలూ లేకపోలేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటాపోటీ
ఫలితాలపై ఉత్కంఠ


