పురపోరుకు పటిష్ట భద్రత
సైబరాబాద్ సీపీ రమేశ్
పటాన్చెరు టౌన్: ఇంద్రేశం–ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ తెలిపారు. ఇస్నాపూర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఎన్నికల నిర్వహణకు మొత్తం 314 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, 9 మంది సీఐలు, 24 మంది ఎస్ఐలు విధులు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో శేరి లింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్, పటాన్చెరు సీఐ వినాయక్రెడ్డి, ఎస్ఐ మహేశ్వర్రెడ్డితోపాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


