● అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు: నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్న క్రమంలో.. ఎవరైనా ఇందిర మ్మ ఇళ్ల కమిటీ సభ్యుల పేరుతో ఇల్లు, స్థలాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తే వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హెచ్చరించా రు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని వేలమంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందజేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సొంత స్థలం ఉంటే రూ.5 లక్షల ఆర్థిక సహాయం, స్థలం లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తోందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో అర్హులైన ప్రతీ ఒక్కరికి వీటిని అందించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేరుతో కొందరు వ్యక్తులు పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, డివిజన్లలో తిరుగుతూ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామంటూ వేల రూపాయలు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని గృహ నిర్మాణ శాఖ జిల్లా పీడీ చలపతిరావును ఆదేశించారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలో సర్వే జరుగుతుందని..అతి త్వరలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో డీఈ సుజాత, ఏఈలు పాల్గొన్నారు.
హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణానికి భూమి పూజ
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం గ్రామ పరిధిలోని జాతీయ రహదారి పక్కన గల వీర హనుమాన్ దేవాలయం పరిధిలోగల హనుమాన్ విగ్రహానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల వీర హనుమాన్ దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలు ధ్వంసం చేసిన నేపథ్యంలో.. దేవాలయం పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించాలి
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి టౌన్: ఆన్లైన్ మోసాల నివారణకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ‘అరైవ్– అలైవ్’వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని సూచించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని స్టేషన్కు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సంగారెడ్డి రూరల్ సీఐ క్రాంతి కుమార్, ఎస్సై మధుసూదన్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీఓ ఉపాధ్యక్షురాలిగా నిర్మల రాజకుమారి
సంగారెడ్డి జోన్: టీఎన్జీఓ సంఘం మహిళా అధ్యక్షురాలిగా నిర్మల రాజకుమారి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలో జిల్లా అధ్యక్షుడు ఎండీ జావీద్అలీ, గౌరవధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ అధ్యక్షతన బుధవారం ఈమెను ఎన్నుకున్నారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి ఎన్నుకున్నందుకు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు తన వంతుగా కృషి చేస్తానన్నారు.
మెరుగైన సేవలు అందించాలి
జిల్లా సంక్షేమాధికారి లలితకుమారి
సంగారెడ్డి జోన్: చిన్నారులతోపాటు వయోవృద్ధుల సంక్షేమం కోసం మెరుగైన సేవలందించాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి సూచించారు. పట్టణంలోని బాల రక్ష భవన్, ప్రణామ్ డే కేర్ సెంటర్, పిల్లల సంక్షేమ కేంద్రం, సఖి, శిశు గృహ, శ్రవణ గ్రంథాలయాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రాలలో పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
‘ఫసల్వాది’కి జాతీయ అవార్డు
సంగారెడ్డి టౌన్: మండల పరిధిలోని పసల్వాది గ్రామం ‘విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ అవార్డు’కు ఎంపికై ందని సర్ప ంచ్ హరిప్రసాద్ ముదిరాజ్ తెలిపారు. దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ముందంజలో ఉన్న పంచాయతీలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రధానం చేస్తుంది. ఇందులో భాగంగానే పసల్వాదిలో ఉన్న సదుపాయాలను మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాన్ని అవార్డుకి ఎంపిక చేశాయని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామానికి జాతీయస్థాయిలో పేరు రావడం సంతోషమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే అవార్డును అందిస్తారని తెలిపారు.


