
స్వయం చోదక వాహనాల పరుగులు
రోబో ట్యాక్సీని ప్రారంభించిన టెస్లా
భారత్లో ప్రారంభ దశలో ఏవీల అభివృద్ధి
యూఎస్, చైనాలో ఇప్పటికే పరుగులు
దారి చూపుతూ, దిశానిర్దేశం చేస్తున్న ఏఐ
అమెరికాలోని ఆస్టిన్ నగర వీధుల్లో ఒక ఎర్ర కారు.. దానిమీద ‘రోబో ట్యాక్సీ’ అని రాసి ఉంది. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ లేదా డ్రైవర్ రహిత కారు. ప్రపంచ ప్రసిద్ధ టెస్లా కంపెనీ ఈ రోబో ట్యాక్సీ సేవలను ఆదివారం ప్రారంభించింది. దీంతో ఇప్పుడు స్వయం చోదక వాహనాల (అటానమస్ వెహికల్ –ఏవీ) మీద చర్చ మరోసారి మొదలైంది. యూఎస్ఏలోని సిలికాన్ వ్యాలీ, చైనాలోని బీజింగ్ నగరంలో ఇప్పటికే ఏవీలు పరుగులు తీస్తున్నాయి. సరుకు రవాణా కోసం అటానమస్ ట్రక్స్ దూసుకెళుతున్నాయి. ప్రపంచంలో వాహనాల తయారీలో నాలుగో స్థానంలో ఉన్న భారత్లో.. ఏవీలు సాకారం అయ్యే అవకాశాలు ఎప్పుడెప్పుడా అని వాహన ప్రియులు ఎదురుచూస్తున్నారు. అసలు ఏవీలు ఎక్కడెక్కడ ఏయే స్థాయిల్లో ఉన్నాయి.. ఏవీ ఎలా పనిచేస్తుంది.. డ్రైవర్ లేకుండా ఇది ఎలా నడుస్తుంది?
విదేశాల్లో ఇలా..
సాధారణ క్యాబ్స్తో పోలిస్తే పలు దేశాల్లో అటానమస్ వెహికల్స్ ఆధారిత క్యాబ్స్ సగం చార్జీలనే వసూలు చేస్తున్నాయి. ఒక్క యూఎస్లోనే ఒక ట్రిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఊబర్ సీఈవో డారా కాస్రోసాహీ ఇటీవల వెల్లడించారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్కు చెందిన వేమో ఇప్పటికే యూఎస్, చైనాలో అటానమస్ వెహికల్స్తో రైడ్ హెయిలింగ్ సేవలు ఆఫర్ చేస్తోంది.
యూఎస్కు చెందిన పోనీ.ఏఐ అటానమస్ క్యాబ్స్ సర్వీసులు అందిస్తోంది. అలాగే అటానమస్ ట్రక్స్ ద్వారా సరుకు రవాణా రంగంలోనూ ఉంది. భారత్కు చెందిన గౌతమ్ నారంగ్, అర్జున్ నారంగ్, అపేక్ష కుమావత్ కలిసి అమెరికాలో ఏర్పాటుచేసిన ‘గతిక్.ఏఐ’ అనే కంపెనీ అటానమస్ ట్రక్స్ ద్వారా వాల్మార్ట్ వంటి కంపెనీలకు సేవలందిస్తోంది. న్యూరో అనే కంపెనీ చిన్న అటానమస్ వ్యాన్స్ ద్వారా యూఎస్లో సరుకు రవాణా చేస్తోంది. చైనాలో డీప్రూట్.ఏఐ ఈ రంగంలో ఉంది. వీరైడ్, వాబి, మోషనల్, అరోరా తదితర కంపెనీలు సైతం ఆటానమస్ వెహికల్స్తో పోటీపడుతున్నాయి.
అమెరికాలోని ఆస్టిన్ నగరంలో టెస్లా కంపెనీకి చెందిన రోబో ట్యాక్సీలను లాంఛనంగా ప్రారంభించారు. దశాబ్దాల కఠోర శ్రమకు ఇది ఫలితమని, అయితే ఇది పైలట్ ప్రాజెక్టేనని టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ తెలిపారు. ప్రస్తుతం ట్రిప్పునకు 4.20 డాలర్లు (సుమారు రూ.364) వసూలు చేస్తున్నారు. ఈ క్యాబ్స్ పూర్తిస్థాయిలో ప్రజలందరికీ ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో మస్క్ ఇంకా ప్రకటించలేదు. మనదేశం విషయానికొస్తే.. టాటా మోటార్స్ ఇటీవల వైయు అనే పూర్తిస్థాయి అటానమస్ వాణిజ్య వాహనానికి పేటెంట్ పొందింది. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది వస్తువులు, ప్రయాణికుల రవాణాకు అనుకూలమైనది.
మన దేశంలో ప్రారంభ దశలోనే..
అటానమస్ వెహికల్స్ రాకతో ఆటోమొబైల్ పరిశ్రమలో సాంకేతికంగా పెద్ద ముందడుగు పడిందని చెప్పవచ్చు. భారత్లో అటానమస్ వెహికల్స్ అభివృద్ధి ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెప్పాలి. పూర్తిగా అటానమస్ అంటే డ్రైవర్ అవసరమే లేకుండా నడిచే వాహనాలు (లెవెల్–5) ఇంకా వాణిజ్యపరంగా అందుబాటులో లేనప్పటికీ.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) అభివృద్ధి, అటానమస్ దిశగా సాంకేతికతల పరీక్షల్లో పురోగతి ఉంది. భారత్లో మైనస్ జీరో, స్వాయత్ రోబోస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా ఈలిక్సీ, ఫ్లక్స్ ఆటో, ఫ్లో మొబిలిటీ తదితర కంపెనీలు ఏవీల అభివృద్ధిపై దృష్టి సారించాయి. ఇదిలా ఉంటే.. డ్రైవర్లెస్ కార్లను భారత్లో అనుమతించేది లేదని పలు సందర్భాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెబుతూ వచ్చారు.
5 లెవెల్స్లో..
వాహనాల నియంత్రణ, నిర్వ హణ విషయంలో ఆటో మేషన్ స్థాయిని బట్టి లెవెల్–0 నుంచి పూర్తి అటానమస్ లెవల్–5 వరకు.. ఏవీలను 6 స్థాయిలుగా వర్గీకరించారు. లెవెల్ – 0 అంటే పూర్తిగా డ్రైవర్పైనే ఆధారపడి ఉంటుంది. లెవెల్ – 1లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ముందున్న వాహనం వేగాన్ని బట్టి ఏవీ దానంతట అదే వేగాన్ని నియంత్రించుకుంటుంది. లెవెల్ – 2లో సాంకేతికత స్టీరింగ్ను, వేగాన్ని నియంత్రిస్తుంది. లెవెల్ 1, 2లలో కచ్చితంగా డ్రైవర్ ఉండాల్సిందే. లెవెల్ –3లో ప్రత్యేక పరిస్థితుల్లో వాహనం దానంతట అదే నియంత్రించుకుంటుంది.
కానీ, కొన్ని సందర్భాల్లో కారు ఇచ్చే అలర్ట్స్ను బట్టి డ్రైవర్ స్టీరింగ్ను తన చేతుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. లెవెల్ –4 అంటే.. చాలా అరుదుగా తప్ప, దాదాపుగా డ్రైవర్ అవసరం లేకుండానే కారు నడుస్తుంది. వీటిని ఎక్కడ పడితే అక్కడ నడపడం సాధ్యం కాదు. ప్రత్యేకమైన ప్రాంతంలోనే (జియో ఫెన్సింగ్ సాయంతో) నడుపుతారు. అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్తి వివరాలే ఫీడ్ చేస్తారన్నమాట. ఆ పరిస్థితుల్లోనే కారు నడవగలదు. లెవెల్ – 5.. అసలు డ్రైవర్ అవసరమే ఉండదు. పూర్తిగా కారు తనంతట తానే నడుస్తుంది. ప్రపంచంలో లెవెల్ – 5 స్థాయి వాహనాలను ఎవరూ తయారుచేయలేదు.
సెన్సార్స్, కెమెరాలతో..
అటానమస్ వెహికల్స్ వాటి పరిసరాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి రూట్ మ్యాప్ను నిర్మించడానికి, నవీకరించడానికి పలు సెన్సార్లపై ఆధారపడతాయి.
⇒ రాడార్ సెన్సార్లు సమీపంలోని వాహనాలను ట్రాక్ చేస్తాయి. కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్స్ను గుర్తిస్తాయి. అలాగే రహదారి సంకేతాలను అర్థం చేసుకుంటాయి. పాదచారులు, ఇతర వాహనాల కదలికలను గమనిస్తుంటాయి.
⇒ లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) సాంకేతికత దూరాలను కొలవడానికి; లేన్ గుర్తులను, రహదారి సరిహద్దులను గుర్తించడానికి లేజర్ పల్స్లను ఉపయోగిస్తుంది. వాహనం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అధిక రిజొల్యూషన్ 3డీ మ్యాప్గా సృష్టిస్తుంది. అడ్డంకులు, పాదచారులు, ఇతర వాహనాలను గుర్తించడంలో సహాయపడుతుంది.
⇒ వాహనాలను నిలిపేందుకు నిర్దేశించిన గీతలను, చుట్టూ ఉన్న కార్లను గుర్తించేందుకు చక్రాల దగ్గర పొందుపరిచిన అల్ట్రాసోనిక్ సెన్సార్లు సహాయపడతాయి.
⇒ ట్రాఫిక్ సంకేతాలు, పాదచారుల సమాచారాన్ని ఇతర కెమెరాలు అందిస్తాయి.
⇒ ఏవీల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), ఇనెర్షియల్ మెజర్మెంట్ యూనిట్ (ఐఎంయూ) కూడా ఉన్నాయి. లొకేషన్ కు సంబంధించిన సమాచారాన్ని జీపీఎస్ అందిస్తుంది. వాహన వేగం, దిశలో వచ్చే మార్పును ఐఎంయూ ట్రాక్ చేస్తుంది.
⇒ సెన్సార్స్ అందించిన డేటాను అత్యంత సామర్థ్యం గల సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేస్తుంది. ఇది సరైన మార్గాన్ని నిర్ణయించడంతోపాటు వాహన వేగం, దిశ, బ్రేకింగ్, స్టీరింగ్ను నియంత్రిస్తుంది. ముందే పొందుపరిచిన ట్రాఫిక్ నియమాలు, అడ్డంకులను గుర్తించే విధానాలు, పరిసరాల అధ్యయనం, మనుషులు, యంత్రాల గుర్తింపు ద్వారా ఈ సాంకేతిక వ్యవస్థ సురక్షిత, సమర్థవంత ప్రయాణాన్ని అందిస్తుంది.