● అంగడి సరుకుగా మారిన గంజాయి
● విద్యార్థులు, యువత టార్గెట్గా విక్రయాలు
● శివారు ప్రాంతాల్లో జోరుగా వినియోగం
● కేసులు నమోదవుతున్నా మారని పరిస్థితి
మొయినాబాద్: రాజధాని శివారు ప్రాంతాల్లో గంజాయి అంగడి సరుకుగా మారింది. విద్యాసంస్థలు, ఫాంహౌస్లను టార్గెట్గా చేసుకుని విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. దీంతో యువత, విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారు. మత్తులో దాడులకు కూడా దిగుతున్నారు. నల్గొండ జిల్లాలో మైనర్లు గంజాయి మత్తులో ప్రిన్సిపల్పై దాడి చేసి హత్య చేసిన ఘటనే ఇందుకు నిదర్శనం.
శివారు ప్రాంతాలే అడ్డాలు
జిల్లాలో ఓఆర్ఆర్ లోపల, వెలుపల ఉన్న మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, హయత్నగర్ మండలాల్లో గంజాయి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తెచ్చి కళాశాలలు, ఫాంహౌస్ల వద్ద గుట్టుగా విక్రయిస్తున్నారు. ఒకరి ద్వారా మరొకరు తెలుసుకుని యువత దానికి అలవాటు పడుతోంది. తనిఖీలు చేసినా కట్టడి లేదుగంజాయిని కట్టడి చేసేందుకు పోలీసులు అప్పుడప్పుడు తనిఖీలు, దాడులు చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. గంజాయి సులభంగా అందుబాటులో ఉండటమే ప్రధాన కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. రవాణా, సరఫరా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మచ్చుకు కొన్ని కేసులు
● 2026 మార్చి 14న మొయినాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ. పోలీసులు వెళ్లిన సమయంలో కాల్పులు జరిగాయి.
● ఆరు నెలల క్రితం: మొయినాబాద్ జేబీఐఈటీ కళాశాల వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు.
● నాలుగు నెలల క్రితం ఫాంహౌస్లో బర్త్డే పార్టీ పేరుతో 11 మంది డ్రగ్స్ తీసుకోగా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.
● ఐదు నెలల క్రితం మహేశ్వరం ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.
● తాజాగా ఎనికేపల్లి ఫాంహౌస్లో ఓ వాచ్మెన్ 15 అడుగుల గంజాయి మొక్క పెంచగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


