కందుకూరు: ఫార్మాసిటీ కోసం గతంలో పెద్ద ఎత్తున భూములు కోల్పోయామని, మళ్లీ ఇప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేదే లేదని రైతులు తేల్చి చెప్పారు. ఫార్మాసిటీ కోసం మండల పరిధిలోని ముచ్చర్ల రెవెన్యూ సర్వే నంబర్లు 115, 121,122, 135 నుంచి 138, 141 నుంచి 154 వరకు 200 మంది రైతులకు సంబంధించిన 283.22 ఎకరాలు సేకరించడానికి వాణిజ్య శాఖ 21/2017 చట్టంలోని 10–ఏ కింద జూన్ 4న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం ఆ భూముల సేకరణ కోసం గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ గోపాల్, నాయబ్ తహసీల్దార్ రాజు, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, టీజీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ ఉమామహేశ్ హాజరై గ్రామ సభను ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ రవి, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, ఊటు మహేందర్ తదితరుల ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, రైతులు, స్థానిక నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ఫార్మాసిటీ కోసం గ్రామ పరిధిలోని 2,371 ఎకరాలు ఇచ్చామని, మళ్లీ అదనంగా ఇవ్వాలంటే కుదరదని స్పష్టం చేశారు. తమ భూముల జోలికి వస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరిస్తూ సభను బహిష్కరించారు. సభ ముందు తమ భూములు ఇవ్వమని తెలిపేలా బ్యానర్లు ప్రదర్శించారు. దీంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు.
తేల్చి చెప్పిన ముచ్చర్ల రైతులు


