మాడ్గుల: ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ కోరారు. మండలానికి శుక్రవారం చేరిన గీతన్నల చైతన్య బస్సుయాత్రకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. కల్లుగీత వృత్తిదారుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తాటిచెట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు మృతి చెందిన గీత కార్మికులకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని, గతంలో మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.20 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 55 ఏళ్లు నిండిన గీత కార్మికులకు రూ.4వేల పెన్షన్, గీత కార్మికులందరికీ కాటమయ్య కిట్లు అందజేయాలన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం మండల నాయకులు మల్లేష్, రమేష్, యాదయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అజీజ్నగర్, హిమాయత్నగర్, ఎనికేపల్లి ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అజీజ్నగర్ చౌరస్తా, మృగవని పార్కు ఎదుట, హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై వర్షం నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.


