మహేశ్వరం: మండల పరిధిలోని తుమ్మలూరు పంచాయతీ కార్యదర్శి అలివేలుపై శుక్రవారం డీఎల్పీఓ సాంబిరెడ్డి విచారణ నిర్వహించారు. గ్రామంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ సర్పంచ్, ఉప సర్పంచ్, సభ్యులతో పాటు పలువురు నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ.. అధికారిక కార్యక్రమాల్లో సెక్రటరీ భర్త పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే వైకుంఠధామం సూచిక బోర్డును తొలగించి మరోచోట ఏర్పాటు చేయించారని డీఎల్పీఓకు వివరించారు. ఆమెను తొలగించకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. కార్యదర్శి అలివేలు మాట్లాడుతూ.. సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్, అధికార కాంగ్రెస్, బీజేపీ నాయకుల అవినీతికి అడ్డు చెప్పడంతోనే తనపై కుట్ర పూరితంగా తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. తాను ఇక్కడి నుంచి వెళ్లిపోయినా, కొత్తగా వచ్చే కార్యదర్శిని సైతం ఇలాగే వేధిస్తారని ఆవేదన వ్యక్తంచేశారు. అందరి అభిప్రాయాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని డీఎల్పీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుమ్మటి అండాలు, ఉప సర్పంచ్ సంగారెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని పాలకవర్గం ఆరోపణ
తనపై తప్పుడు ఫిర్యాదు చేశారన్న కార్యదర్శి
జీపీ వద్ద విచారణ చేస్తున్న డీఎల్పీఓ


