తుర్కయంజాల్: జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 10న జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ కోరారు. శుక్రవారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూర్, తుర్కయంజాల్ డివిజన్లలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కరపత్రాలను అందజేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం రాగన్నగూడలోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నయా ఉదారవాద సంస్కరణలను వేగంగా అమలు చేస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను తొలగించారని మండిపడ్డారు. వాటి స్థానంలో కార్పొరేట్లకు, పరిశ్రమల యాజమాన్యాలకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసేందుకు ఫైనల్ రూల్స్ నోటిఫై చేసిందని పేర్కొన్నారు. రోజువారి పనిదినాన్ని 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుకునేందుకు యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా నాయకుడు అరుణ్కుమార్, కార్మికులు కృష్ణ, సాలయ్య, రవి, వెంకట్రెడ్డి, గోపాల్, సంతోష్ పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కిషన్


