● రెండు షాపులపై దాడులు
● కేసు నమోదు చేసిన మోకిల పోలీసులు
శంకర్పల్లి: రెండు వేర్వేరు ఘటనల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేయడంతో పాటు, పైపులు అమ్ముతున్న వారిపై గురువారం మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మోకిల గ్రామంలో మెగ్వాల్ పరాశురాం అనే వ్యక్తి గత కొంతకాలంగా గ్యాస్ సిలిండర్లలో అక్రమంగా రీ ఫిల్లింగ్ చేయడంతో పాటు, సిలిండర్లు, పైపులు విక్రయిస్తున్నాడు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం షాపుపై దాడులు నిర్వహించారు. 30 చిన్న, 9 పెద్ద సిలిండర్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. అదే విధంగా ఇంద్రారెడ్డి నగర్లోని జై భవాని స్టీల్ సెంటర్లో నకిలీ రెగ్యూలేటర్లు, పైపులు అమ్ముతున్నట్లు సమాచారం రాగా.. పోలీసులు దాడులు చేశారు. 6నకిలీ రెగ్యూలేటర్లు, 25గ్యాస్ పైపులను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలుంటాయని ఎస్ఐ సురేశ్ హెచ్చరించారు.
సాగుకు అడ్డు తగులుతున్న వ్యక్తి అరెస్ట్
మోమిన్పేట: పంట సాగుకు అడ్డు పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ భరత్భూషణ్ గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నా యి. మండలంలోని బూర్గుపల్లికి చెందిన మేక ల శ్రీనివాస్, మేకల నగేశ్, మేకల శోభరాణి గత నెల 27న అదే గ్రామానికి చెందిన మంతెన కృష్ణం రాజు భూమిలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
కుటుంబ కలహాలు.. వ్యాపారి ఆత్మహత్య
రాజేంద్రనగర్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యాపారి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదర్గూడ లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన ఆశిష్ శర్మ (38) నగరంలో ముత్యాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఆరేళ్ల క్రితం భార్యాభర్తలు విడిపోయారు.అప్పటినుండి ఆశిష్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చిన ఆశిష్ శర్మ గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


