మంచాల: తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అవమానానికి గురిచేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. జాపాల పంచాయతీ కార్యదర్శి మురళీమోహన్చారి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అవమానపర్చిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. తక్షణమే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొత్త జీఓతో వేతనాలు తగ్గాయ్
● మున్సిపల్ సిబ్బంది ఆవేదన
● స్పీకర్ ప్రసాద్కుమార్కు వినతిపత్రం
అనంతగిరి: ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన కొత్త జీఓలో తమ వేతనాలను తగ్గించిందని మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం వికారాబాద్ వచ్చిన స్పీకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో నీటి సరఫరా, ఎలక్ట్రికల్ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, శానిటరీ జవాన్ల వేతనాలను తగ్గించిందని తెలిపారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీఓతో నీటి సరఫరా సిబ్బంది, సూపర్వైజర్లు, ఆఫీస్ సబార్డినేట్లకు రూ.1,000 చొప్పున, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.4,250, వర్క్ ఇన్స్పెక్టర్లకు 3,900 చొప్పున తక్కువ జీతం వచ్చిందన్నారు. అసలే చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న తమకు వేతనాలను తగ్గించడం ఏమిటని వాపోయారు.
పంద్రాగస్టు నాటికి యూనిఫాంల పంపిణీ
బషీరాబాద్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి యూనిఫాంలు అందజేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి తెలిపారు. గురువారం బషీరాబాద్ ఎంపీపీఎస్లో టీచర్లతో కలిసి విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే తొలి జత యూనిఫాంల పంపిణీ పూర్తయిందని, రెండో జత కుట్టు పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని వివరించారు. ప్రభుత్వం సరఫరా చేసిన వస్త్రంతో ఒక్కో విద్యార్థికి రూ.74 వ్యయంతో మహిళా సంఘాలే యూనిఫాంలను కుట్టి అందిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అస్మాఖతామ్, ఉపాధ్యాయులు చంద్రకళ, ఐఆర్పీ జ్యోతి, మహిళా సంఘాల ప్రతినిధి భాగ్యలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.


