ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నల్లకంచెలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రాధిక గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్కేఎస్ఎస్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్మేళాకు ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటో, బ్యాంక్ అకౌంట్ తదితర పత్రాలతో హాజరుకావాలని సూచించారు. అభ్యర్థుల అర్హతను బట్టి కంపెనీలోని ఆయా ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుందని తెలిపారు.
చేవెళ్ల: సబ్రిజిస్ట్రార్ కార్యాలయంకోసం అధికారులు స్థలాన్ని పరిశీలించారు. చేవెళ్లలోని సర్వే నంబర్ 86లో ఉన్న ప్రభుత్వ భూమిని గురువారం హౌసింగ్ డీఈ జ్యోతి, ఏఈ శ్రీనివాస్, రెవెన్యూ సర్వేయర్ అంజనేయులు బృందం వేర్వేరుగా పరిశీలించారు. బైపాస్ రోడ్డు పక్కన ఉన్న ఈ స్థలం అనువుగా ఉందని గుర్తించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపారు.
ఇబ్రహీంపట్నం: ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల్లో కోత విధిస్తే సహించేదిలేదని మున్సిపల్ కార్మికులు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 1181 జీవోతో తమ నెలవారీ వేతనాల్లో రూ.4వేలు కోత పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్న తమ పొట్ట కొట్టొద్దన్నారు. 1181 జీవోను రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, స్థిరమైన వేతనాలు అందించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సుదర్శన్కు వినతిపత్రం సమర్పించారు.
కందుకూరు: పామాయిల్ సాగులో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని కేంద్ర నీతి అయోగ్ సభ్యుడు కేవీ రాజు అన్నారు. గుమ్మడవెల్లిలోని రైతు బి.మనీష్రెడ్డికి చెందిన పామ్ ఆయిల్ తోటను గురువారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి వారికి పామాయిల్ పంటపై ఉన్న అవగాహన తెలు సుకున్నారు. అనంతరం అగర్మియాగూడలో రైతు ఆదిబ్అహ్మద్ చేపట్టిన కూరగాయల సాగు, పశువుల పెంపకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఒకే రకం పంటను కాకుండా, సమగ్ర వ్యవసాయ విధానం చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట నీతి అయోగ్ స్టేట్ యంగ్ ప్రొఫెషనల్ ఆష్ణాశర్మ, డైరెక్టర్ ఎకనామిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రూఫూస్, ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ సరోజిని, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్, డివిజన్ ఉద్యాన శాఖ అధికారి సౌమ్య, పామాయిల్ ఏరియా మేనేజర్ సుమంత్, హెచ్ఈఓ శ్రవణ్, ఎఫ్ఓ మల్లేష్ పాల్గొన్నారు.
షాద్నగర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు దోస్తుద్వారా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 11వరకు దోస్త్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కళాశాల ఆప్షన్ ఇచ్చుకోవాలని తెలిపారు. 14న సీట్ల కేటాయింపు ఉంటుందని, సమాచారాన్ని విద్యార్థుల ఫోన్కు చేరవేయడం జరుగుతుంద న్నారు. 14 నుంచి 18 వరకు సెల్ఫ్, కళాశాలలో రిపోర్ట్ చేయాలన్నారు. బీఎస్సీ లైఫ్సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీఏ తెలుగు మీడియం, ఇంగ్లిష్ మీడియం, బీకాం కంప్యూటర్ అప్లికే షన్స్, ఉద్యోగ ప్రాధాన్యత కలిగిన బీఎస్సీ ఫార్మాస్యూటికల్ సైన్స్, బీకాం రిటైల్ ఆపరేషన్స్వంటి కోర్సుల్లో సీట్లు మిగిలాయన్నారు.


