షాద్నగర్ రూరల్: టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ)తోనే సాధ్యమని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై టీఎంయూ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ సమస్యలపై ఏనాడూ మాట్లాడలేదని ఆరోపించారు. తమ సంఘం ఆందోళనల నేపథ్యంలో చర్చలు మొదలుపెట్టిందని తెలిపారు. త్వరలోనే జరిగే ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ఆర్టీసీ విలీనంతో ఈ ఎన్నిక ముడిపడి ఉందని తెలిపారు. కార్మికులు తమ ప్రయోజనాలకోసం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
నూతన కమిటీ ఎన్నిక
అనంతరం డిపో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా వెంకటయ్యగౌడ్, ఉపాధ్యక్షుడిగా ఎంఎస్ రెడ్డి, కార్యదర్శులుగా మాకం నర్సింలు, జాయింట్ సెక్రటరీగా మక్సూద్, ప్రచార కార్యదర్శిగా రుషికుమారి, రీజినల్ కమిటీ సభ్యుడిగా అర్జున్కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు రఘునాయక్, నాయకులు తిరుపతయ్య, రవీందర్ గౌడ్, డీవీ.స్వామి, రాకేష్, బాల్రాజ్, జీవీఎం రావు, జహంగీర్, వెంకటేశ్, పావని, స్వప్న పాల్గొన్నారు.
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అశ్వత్థామరెడ్డి


