ఇబ్రహీంపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు, కార్మిక, వ్యవసాయ కూలీల ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంచందర్ పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో బుధవారం నిర్వహించిన సీపీఎం అనుబంధ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్లకు అనుకూల ధోరణితో వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 10వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే జైల్ భరో కార్యక్రమానికి కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. అందుకు గ్రామగ్రామాన ప్రచారాన్ని నిర్వహించాలని ఆయా సంఘాల నేతలను కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు జంగయ్య, జగన్, వెంకటేశ్, ముసలయ్య, ఎల్లేశ్, యాదగిరి, మహేశ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంచందర్


