● యూనిఫాంల కోసం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఎదురుచూపు
● ఇందిరా మహిళా శక్తి సెంటర్లకు
కుట్టు బాధ్యతలు
● నాలుగు క్లస్టర్లలో కొనసాగుతున్న పనులు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ పాఠశాలు తెరిచి నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాంలు అందలేదు. దీంతో సాధారణ దుస్తులు ధరించి స్కూళ్లకు వెళ్తున్నారు. కనీసం పంద్రాగస్టు నాటికై నా స్కూల్ డ్రెస్లు అందుతాయో.. లేదో..? తెలియని పరిస్థితి నెలకొంది.
మారిన యూనిఫాం ..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఏటా రెండు జతల దుస్తులు అందిస్తున్నారు. మండలంలోని 24 స్కూళ్లలో 2,192 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో బాలురు 1,106 మంది, బాలికలు 1,086 మంది ఉన్నారు. వీరికి కొత్త యూనిఫాంలు అందకపోవడంతో గతేడాది ఇచ్చిన దుస్తువులతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో మెరున్ కలర్ ప్యాంట్, తెలుపు మెరున్ కలర్ చెక్స్ కలిగిన డ్రెస్లు అందించారు. ప్రస్తుతం బ్లాక్ ప్యాంట్, బ్లూ కలర్ షర్టు పంపిణీ చేయనున్నారు. ఒకటి నుంచి మూడో తరగతి బాలికలకు గౌను మాదిరి, ఒకటి నుంచి ఐదో తరగతి బాలురకు షార్ట్, షర్టు, నాలుగు, ఐదు తరగతుల బాలికలకు స్కర్ట్, షర్టు, ఆరు నుంచి 12వ తరగతి బాలికలకు ప్యాంట్, షర్టు, వాస్కోట్, బాలురకు ప్యాంట్, షర్ట్ ఇవ్వనున్నారు. రంగు మార్చి కాన్వెంట్ స్కూల్ డ్రస్సు మాదిరిగా కనిపించేలా ఏర్పాటు చేశారు.
నాలుగు క్లస్టర్లలో కుట్టు కేంద్రాలు..
యూనిఫాంలు కుట్టే బాధత్యలను మండలంలోని స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. కటింగ్తో పాటు డ్రస్ కుట్టి, కాజాలు వేసి, ఇసీ్త్ర చేస్తే ఒక్కో డ్రస్కు రూ.75, కటింగ్ చేసి ఇస్తే రూ.50 చెల్లిస్తారు. ప్రస్తుతం నాలుగు ఇందిర మహిళా శక్తి కేంద్రాల్లో కుట్టు పనులు ప్రారంభమయ్యాయి. రాయపోల్, తులేకలాన్, దండుమైలారం, ఉప్పరిగూడ క్లస్టర్ల వారీగా పనులు కొనసాగుతున్నాయి. ఐకేపీ అధికారులు 45 మంది టైలర్లను గుర్తించగా ప్రస్తుతం 20 మంది పని చేస్తున్నారు. మొదటి దశలో ఒక్కో విద్యార్థికి ఒక్కోటి చొప్పున 2,192 డ్రస్సులు కుట్టి ఇవ్వాలి. మరో జత ఎప్పుడిస్తారనే విషయంలో స్పష్టత లేదు. విద్యార్థులకు ఒకేసారి రెండు జతలు ఇవ్వాలి కానీ, ప్రస్తుతం ఒక్కటైనా ఇవ్వాలని భావిస్తున్నారు.
ఒక్క జతైనా ఇచ్చేలా..
ఆగస్టు 15 నాటికి విద్యార్థులందరికీ యూనిఫాంలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు పనులను వేగవంతం చేశారు. జెండావందనం నాటికి కనీసం ఒక్కో డ్రస్ అయినా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఏదిఏమైనా రెండు రోజుల ముందే విదవిద్యార్థులకు దుస్తులు అందించేలా ఐకేపీ అధికారులు ముందుకు సాగుతున్నారు.
ముందుగానే ఇచ్చేస్తాం
ప్రభుత్వం ఇచ్చిన గుడువులోపు యూనిఫాంలు సిద్ధం చేస్తాం. ఆగస్టు 13నాటికి కుట్టడం పూర్తయ్యేలా చూస్తున్నాం. ఇప్పటివరకు సగం పనులు పూర్తయ్యాయి. మరికొంత మంది టైలర్లను సమకూర్చి పనుల్లో వేగం పెంచుతాం.
– సాంబశివుడు, ఐకేపీ ఎంపీఎం
త్వరగతిన పూర్తి చేయాలి
గడువులోపు విద్యార్థులందరికీ యూనింఫాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొత్త యూనిఫాంలతో జెండా వందనం చేసేలా ముందుకు సాగుతున్నాం.
– హీర్యానాయక్, ఎంఈఓ


