యాచారం: మండల పరిధిలోని మాల్ పంచాయతీని శనివారం జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ సందర్శించారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పంచాయతీ అధికారి సాధన, మండల పంచాయతీ అధికారి శ్రీలత, పంచాయతీ రాజ్ ఏఈఈ సూర్యవంశీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ సుభాష్తో కలిసి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఆత్మనిర్భర్ నేషనల్ పంచాయతీ అవార్డు కింద వచ్చిన రూ. కోటి నిధులు ఏ అభివృద్ధి పనులకు ఖర్చు చేశారో ఆరా తీశారు. పలు అభివృద్ధి పనుల నాణ్యత, కొలతలు, రికార్డుల పరిశీలన చేశారు. నిధుల ఖర్చు, రికార్డుల్లో తేడాలు ఉండడం గమనించారు. పూర్తి స్థాయి పరిశీలన కోసం రికార్డులను సీజ్ చేసి వెంట తీసుకెళ్లారు.
ఎస్సీ మోర్చా జిల్లా
అధ్యక్షుడిగా నర్సింహ
షాద్నగర్: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్ గ్రామానికి చెందిన విఠ్యాల నర్సింహ ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పదవీ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎస్సీ మోర్చా కమిటీలు ఏర్పాటు చేసి, అందరినీ సంఘటితం చేస్తానని తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.
పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించండి
శంకర్పల్లి: పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ సూచించారు. మోకిల పోలీస్ స్టేషన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. స్టేషన్కి వచ్చే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలని అన్నారు. మాదకద్రవ్యాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. తనిఖీల సమయంలో సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు సురేశ్, సాయికృష్ణ తదితరులు ఉన్నారు.
షాబాద్: చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా అదనపు న్యాయమూర్తి బి. శ్రీనివాసులు పేర్కొన్నారు. మండల పరిధిలోని చందనవెల్లిలో సర్పంచ్ చేవెళ్ల నవనీత స్వామి ఆధ్వర్యంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానాలు, వాటి ద్వారా జరిగే న్యాయం గురించి వివరించారు. క్షణికావేశాలకు వెళ్లి అనర్థాలు కొని తెచ్చుకోవద్దని, కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండాలని సూచించారు. సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కె.దశరథ రామయ్య వివిధ చట్టాల గురించి క్షుణ్ణంగా వివరించారు. పలువురు న్యాయవాదులు ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పి.మల్లేష్ యాదవ్, మాజీ సర్పంచ్ నర్సింహారావు, ఉపసర్పంచ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


