ఇబ్రహీంపట్నం: పాత బస్టాండ్ సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదు గదుల్లో ఒకటి ప్రధానోపాధ్యాయుడి కార్యాలయ గది, మరొకటి సైన్స్ ల్యాబ్కు ఉపయోగిస్తున్నారు. 200 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఎనిమిది తరగతులకు మూడు గదులు మాత్రమే ఉన్నాయి. వరండాలో రెండు క్లాసులు, దాత సహకారంతో వేసిన రేకుల షెడ్లో మరో రెండు నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆట స్థలం లేక విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారు. శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లు, వంటగది అవసరానికి సరిపడడం లేదు. ఇళ్ల నుంచే విద్యార్థులు తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఆరు, ఏడు తరగతులకు నలుగురు టీచర్లు కావాల్సి ఉండగా ఇద్దరే పనిచేస్తున్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గదుల కొరత ఉంది. 120 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఆరుబయట విద్యాబోధన, మధ్యాహ్న భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. వంట గదినే ఒక పార్టుగా చేసి తరగతి గది నిర్వహిస్తున్నారు.
సౌకర్యాలు లేక అవస్థలు
విద్యార్థులు కూర్చునేందుకు సరిపడా గదులు లేవు. ఆటలాడేందుకు స్థలం లేదు. అవసరాలకు తగ్గట్టు మూత్రాశాలలు, మరుగుదొడ్లు లేవు. విద్యాబోధన బాగున్నప్పటికీ సరైస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నాం.
– జె.తరుణి, ఐదో తరగతి విద్యార్థిని


