● వికారాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్
● గరిష్టంగా 36.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు
తాండూరు: ఎండలు మండుతున్నాయి.. నిన్న మొన్నటి వరకు చల్లటి వాతావరణంలో ఉన్న ప్రజలకు ఎండ వేడి చురకలంటిస్తోంది. పక్షం రోజులుగా గ్రీన్ జోన్లోనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి. గత నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. సోమవారం వికారాబాద్ జిల్లా ఎల్లో అలర్ట్ జోన్లోకి వెళ్లింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది.
గ్రీన్జోన్లో పరిగి, చౌడాపూర్
జిల్లాలో 20 మండలాలు ఉండగా రెండు మండలాలు మినహా 18 మండలాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం ధారురు మండలంలో 36.9 డిగ్రీలు, దుద్యాల మండలంలో 36.7 డిగ్రీలు, మర్పల్లి మండలంలో 36.6 డిగ్రీలు నమోదవ్వగా మరో ఏడు మండలాల్లో 36.5 డిగ్రీల వరకు, ఎనిమిది మండలాల్లో 35 డిగ్రీలకు వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పరిగి, చౌడాపూర్ మండలాలు 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతతో గ్రీన్ జోన్లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 17 – 20 డిగ్రీల కనిష్ట్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాండూరు ప్రాంతంలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


