● వినూత్న ప్రయోగాల శిల్పి నల్ల విజయ్కుమార్ ● భవిష్యత్లో విజయ్కుమార్తో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయిస్తా ● సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు
సిరిసిల్ల/వేములవాడ: మరమగ్గాలు వచ్చిన తరువాత ఆధునికతతో నాణ్యమైన వస్త్రోత్పత్తులు, వినూత్న ఆవిష్కరణ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్లలో నల్ల విజయ్కుమార్ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ జకార్డ్ టెక్నాలజీతో నడిచే కార్ఖానాను శనివారం ప్రారంభించి మాట్లాడారు. నాలుగు దశాబ్దాల కిందటే చేనేత కళాకారుడు నల్ల పరంధాములు అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని చాటి చెప్పారన్నారు. పరంధాములు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు విజయ్ వినూత్న ప్రయోగాలు చేస్తున్నారని ప్రశంసించారు.
వెండి వెన్నెల చీర ఆవిష్కరణ
‘షిఫ్ట్ జకార్డ్’ పేరుతో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వెండి, బంగారంతో ప్రత్యేకమైన చీరలను రూపొందిస్తున్నారని కేటీఆర్ అభినందించారు. ‘వెండి వెన్నెల’ పేరుతో రూపొందించిన చీర అద్భుతంగా ఉందని అభినందించారు. భవిష్యత్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. విజయ్ కోసం అద్భుతమైన కర్మాగారం ఏర్పాటు చేసి, అవసరమైన సబ్సిడీలు అందిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ వేములవాడ ఇన్చార్జి చలిమెడ లక్ష్మీనర్సింహరావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ వైస్చైర్మన్ దార్ల సందీప్, బీఆర్ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, మంచె శ్రీనివాస్, దార్నం లక్ష్మీనారాయణ, తుమ్మ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ జిల్లా బిడ్డగా విద్యార్థులకు అండగా నిలుస్తా
సిరిసిల్ల ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, ఈ జిల్లా బిడ్డగా విద్యార్థులకు అండగా నిలుస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు 20 రోజులకు పైగా ఆందోళన చేస్తుండగా.. శనివారం వారిని కలిసి మాట్లాడారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడొద్దన్నారు. బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మినరసింహరావు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.


