వీర్నపల్లిలో అత్యధికంగా 17.2 మిల్లీమీటర్లు
సిరిసిల్ల: జిల్లాలో సోమవారం చిరుజల్లులు కురిశాయి. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు మత్తడి దూకుతోంది. పది రోజుల కిందటే కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం నిండింది. మత్తడి గుండా నీరు బయటకు వస్తోంది. వట్టిమల్ల–నిమ్మపల్లి, బావుసాయిపేట– వెంకట్రావుపేట, మామిడిపల్లి–నిజామాబాద్ గ్రామాల మధ్య మూలవాగు వరదతో రాకపోకలు నిలిచిపోయాయి. నర్మాల ఎగువ మానేరు నిండి మత్తడి దూకడంతో మానేరు వాగు వెంట ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులోకి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మానేరువాగు వెంట ఉన్న పోలీస్స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తంగా చేశారు.
కొనసాగుతున్న మధ్యమానేరు నీటి విడుదల
మధ్యమానేరు ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. మిడ్మానేరు నీటి మట్టం 27.55 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 21.777 టీఎంసీల నీరు చేరింది. నాలుగు గేట్లను ఎత్తి ఎంఎండీకి 5,127 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరోవైపు మూలవాగు, మానేరు వాగు ద్వారా వరద నీరు, శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా గోదావరి జలాల పంపింగ్ నీరు మొత్తం 15,497 క్యూసెక్కుల నీరు మధ్యమానేరుకు చేరుతోంది. ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ జలాశయం నిల్వ సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.513 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వర్షం జల్లులతో జిల్లాలోని 656 చిన్ననీటి వనరుల్లోకి వరద నీరు చేరుతుంది. జిల్లాలో ఇప్పటికే 27 చెరువులు నిండి మత్తడి పారుతున్నాయి. మరో 80 చెరువులు మత్తడి దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి.


