కాలువలో పడి సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

కాలువలో పడి సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ మృతి

Aug 6 2026 8:14 AM | Updated on Aug 6 2026 8:14 AM

● బైక్‌ అదుపుతప్పి బూడిదకాలువలో పడి..

రామగుండం: స్థానిక ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌)లో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తే నయీం(50) పెద్దపల్లి జిల్లా రామగుండం అక్బర్‌నగర్‌లోని ఎన్టీపీసీ బూడిద కాలువలో బుధవారం ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. ఎస్సై సంధ్య కథనం ప్రకారం.. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన నయీం స్థానిక ఐవోసీలో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి రోజూ రైలులో వచ్చి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా అక్బర్‌నగర్‌లోని బూడిదకాలువలో బైక్‌ అదుపు తప్పి పడి చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నారు.

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

జగిత్యాలక్రైం: జగిత్యాలలోని మహాలక్ష్మీనగర్‌కు చెందిన మెహమద్‌ మహమ్మద్‌ (50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. మహమ్మద్‌ అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది పురుగుల మందుతాగాడు. మృతుడి బంధువు మహమద్‌ ముజీబ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండలో గతనెల 30న స్కూల్‌ వ్యాన్‌ ఢీకొని గాయపడిన సల్వల రాజేశ్‌ (28) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. వర్షకొండ గ్రామానికి చెందిన రాజేశ్‌ తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. మెట్‌పల్లికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల వ్యాన్‌ పిల్లలను దింపి వస్తోంది. మూలమలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రాజేశ్‌ తలకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. రాజేశ్‌ 25రోజుల క్రితమే సౌదీ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అతడి తల్లి నర్సు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి..

జగిత్యాలరూరల్‌: సారంగాపూర్‌ మండలం గణేశ్‌పల్లి పోతారం గ్రామానికి చెందిన యాకసిరి సుబ్రహ్మణ్యం (29) అప్పుల బాధతో ఈనెల 3న పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి కళ్లను కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి దానం చేశారు. మృతుడి భార్య గంగజల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గీత తెలిపారు. కార్యక్రమంలో ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రి టెక్నీషియన్‌ ప్రవీణ్‌, ఎస్సై గీత, ఫోరెన్సిక్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

హత్యకేసులో నిందితుడికి జీవితఖైదు

కరీంనగర్‌ క్రైౖం: యువకుడిని కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడు నద్దునూరి అనిల్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ కరీంనగర్‌ నాలుగో అదనపు జిల్లా న్యాయస్థానం జడ్జి జే.కవిత బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రణయ్‌(23) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. యువతి సోదరుడు నద్దునూరి అనిల్‌కు ఇష్టం లేకపోవడంతో ప్రణయ్‌ను పలుమార్లు హెచ్చరించాడు. 2020 అక్టోబర్‌ 19న రాత్రి సుమారు 10 గంటల సమయంలో ప్రణయ్‌ యువతి ఇంటికి వెళ్లగా అనిల్‌ గమనించాడు. ప్రణయ్‌ అక్కడి నుంచి పారిపోతుండగా అనిల్‌ వెంటాడి కర్రతో తీవ్రంగా దాడి చేశాడు. ప్రణయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో వీణవంక పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి జమ్మికుంట సీఐ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు దర్యాప్తు చేపట్టారు. సాక్ష్యులను సీడీవో ఆర్‌.శ్రీనివాస్‌ కోర్టులో హాజరుపరచగా, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు జూలూరు శ్రీరాములు, ప్రతాప్‌ ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనలు వినిపించారు. న్యాయస్థానం నిందితుడు అనిల్‌కు జీవితఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement