వంద పోలింగ్ కేంద్రాల్లో నూరు శాతం
సిరిసిల్లలో 86.15..
వేములవాడలో 87.71
కోనరావుపేటలో అత్యధికంగా 94 శాతం పూర్తి
ముస్తాబాద్(సిరిసిల్ల): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 90 శాతం పూర్తి కానుంది. ఖచ్చితమైన ఓటరు జాబితా కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం సర్కు గడువు మరో మూడు రోజులే మిగిలి ఉంది. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 574 పోలింగ్ కేంద్రాల్లోని ఓటర్ల వివరాలు నమోదు చేస్తున్నారు. మానకొండూరు పరిధిలోకి వచ్చే ఇల్లంతకుంట, చొప్పదండి పరిధిలోకి వచ్చే బోయినపల్లి మండలాల్లోనూ సర్ వేగంగా కొనసాగుతోంది. ఆగస్టు 3 తర్వాత ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని వారికి అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఎన్యూమారేషన్ ఫారాలను బీఎల్వోలు ఆన్లైన్ చేస్తున్నారు.
వివరాలు ఇవ్వని 13వేల మంది
జిల్లా వ్యాప్తంగా 4,75,694 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ ఎన్యూమారేషన్ ఫారాలను బీఎల్వోలు అందించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 2,46,562 ఓటర్లకు ఇప్పటి వరకు 2,12,406 మంది నుంచి ఫారాలు తీసుకున్నారు. ఇంకా 10,139 మంది వివరాలు రాకపోగా, 2,284 మంది పేర్లు తొలగించడమో, తరలించడమో, లేదా మృతిచెందడమో జరిగింది. వేములవాడ పరిధిలో 2,29,132 మంది ఓటర్లు ఉండగా, 2,00,971 మంది ఓటర్ల వివరాలు తీసుకున్నారు. మరో 1,026 మంది మృతిచెందడమో, షిప్టు చేయడమో, డబుల్గా ఉండడమో జరిగిందని అధికారులు తెలిపారు. సిరిసిల్లలో 10,139 మంది, వేములవాడలో 3,858 మంది వివరాలు అందజేయాల్సి ఉంది. ముస్తాబాద్ మండలంలో వెంకట్రావుపల్లె, చీకోడు, మొర్రాయిపల్లి గ్రామాలు వంద శాతం సర్ను సాధించాయి. సిరిసిల్ల పట్టణంలో 81శాతం, కోనరావుపేటలో 94, గంభీరావుపేట, వీర్నపల్లిలో 91, ఎల్లారెడ్డిపేటలో 87, ముస్తాబాద్లో 89, వేములవాడలో 82, వేములవాడ రూరల్లో 92 శాతం వరకు చేరుకున్నాయి.


