కొనుగోలు చేశాం
● కలెక్టర్కు విన్నవించిన అర్జీదారులు ● సత్వరమే పరిష్కరించాలి.. ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు అర్జీదారులు జిల్లా నలుమూలల నుంచి కలెక్టర్కు విన్నవించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి తమ విన్నపాలతో తరలివచ్చారు. క్యూలో నిల్చొని తమ బాధలను కలెక్టర్కు తెలిపి ఆదుకోవాలని కోరారు. దాదాపు 175 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణికి 10 దరఖాస్తులు రాగా సిరిసిల్లలో 6, వేములవాడలో 4 వచ్చాయి.
మాది సిరిసిల్లలోని సుందరయ్యనగర్. నా భర్త శ్రీధర్. మాకు ఇద్దరు కూతుళ్లు. రెండో కూతురు మానసిక అంగవైకల్యంతో జన్మించింది. ఈమెతో సుమారు 14 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాం. ఆమె ఆరోగ్య రీత్య ఏమి చేయలేకపోతున్నాం. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేసి ఆదుకోండి.
– గజ్జెల్లి మమత–శ్రీధర్, సుందరయ్యనగర్
మాది తంగళ్లపల్లి మండలం పద్మనగర్. 2021లో నీటి సమస్య ఉందని అధికారుల అనుమతితో నా సొంత డబ్బులతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలుసార్లు ప్రజావాణిలో బిల్లుల కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా బిల్లులు మంజూరు చేయండి.
– ముడారి పోచయ్య,
పద్మనగర్ మాజీ సర్పంచ్
నేను దివ్యాంగురాలిని. గతంలో దివ్యాంగురాలు పెన్షన్ వచ్చింది. కానీ 30 శాతం మాత్రమే వైకల్యం ఉందని పెన్షన్ రద్దు చేశారు. అయితే నేను ఒంటరి మహిళను. ఒంటరి మహిళ పెన్షన్ ఇప్పించండి.
– ఆడెపు చిలుకవ్వ, నెహ్రూనగర్ సిరిసిల్ల
మాది ఇల్లంతకుంట మండలం రేపాక పరిధిలోని చింతలకుంటపల్లి. మాకు ఎలాంటి వ్యవసాయ భూమి లేదు. రేపాక శివారులో బోయిని బాలయ్య, దుర్గయ్య వద్ద 25 ఏళ్ల క్రితం ఆరుగురం కలిసి 2.17 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. ఆ భూమిని మిగులు భూమికింద నమోదు చేశారు. సర్వేయర్తో హద్దులు చేసి మాకు పట్టాచేయాలి.
– చింతలకుంటపల్లి(ఇల్లంతకుంట)
మాది కోనరావుపేట మండల పరిధిలోని జై సేవాలాల్ఊరు తండా. మాకు గత ప్రభుత్వం పోడు భూముల పట్టాలు ఇచ్చింది. భూమిని చదును చేసుకొని పంటలు సాగుచేసుకుంటున్నాం. అటవీశాఖ అధికారులు మా భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మా భూములకు హద్దులు ఏర్పాటు చేయండి.
– జైసేవాలాల్ తండా, గ్రామస్తులు
కోడిగుడ్డు ధర మార్కెట్లో రూ.8.50 వరకు ఉంది. ప్రభుత్వం ఇచ్చే బిల్లు రూ.6 మాత్రమే. ఒక్కో గుడ్డుపై అదనంగా రూ.2.50 మధ్యాహ్న భోజన కార్మికులపై భారం పడుతుంది. కాబట్టి కోడిగుడ్డుకు బదులుగా అరటిపండు అందించేలా అనుమతి ఇవ్వండి.
– మధ్యాహ్న భోజన సంఘం నిర్వాహకులు


