
రాజన్నా.. దారికొచ్చేనా !
● వేములవాడలో కొలిక్కిరాని రోడ్ల విస్తరణ ● సర్వేలతోనే సరిపెడుతున్న అధికారులు ● ఏడు శాఖల ఆధ్వర్యంలో కొలతలు ● పునరావాసం కల్పించాలంటున్న దుకాణ యజమానులు
వేములవాడ: దక్షిణ కాశీ.. ఆధ్యాత్మిక పట్టణం వేములవాడలో స్థానికులు, భక్తులు నిత్యం ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. రోజూ వేలాది మంది భక్తులు తరలివచ్చే ఈ పట్టణంలో ఇరుకై న రహదారితో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. ప్రత్యేక వారాలు శని, ఆది, సోమవారాల్లో భక్తుల రాక పెరగడంతో వాహనాల రద్దీ సైతం పెరిగిపోతుంది. దీంతో తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ప్రధాన ఆలయం, అక్కడి నుంచి కోరుట్ల బస్టాండ్, ఇటు జగిత్యాల బస్టాండ్ వరకు రోడ్లపై వాహనాలు, జనం రద్దీతో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితులు ఉంటున్నాయి. దీనికి పరిష్కారంగా ప్రధాన రహదారులను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.47కోట్లు మంజూరు చేసింది. కానీ పనులు మాత్రం ముందుకుసాగడం లేదు. ఏళ్లుగా సర్వేలతోనే సరిపెడుతున్నారు. ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో 243 మంది తమ ఆస్తులు పోయే పరిస్థితి ఉంది. అయితే పరిహారం విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో యజమానులు ముందుకురావడం లేదని తెలిసింది. వేములవాడలో రోడ్ల విస్తరణలో జాప్యంపై స్పెషల్ స్టోరీ.
కొలతలతోనే సరి
వేములవాడ పట్టణంలోని మెయిన్రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు జిల్లా అధికారుల ఆదేశాలతో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్లు భవనాలశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం, అటవీశాఖ.. ఏడు శాఖల అధికారులతో కూడిన నాలుగు బృందాలు 24 మంది సభ్యులు ఇప్పటికే పలుమార్లు అంచనాలు వేశారు. పరిహారం అందించేందుకు తుది జాబితాను సిద్ధం చేయాలన్న అధికారుల ఆదేశాలతో కొలతలు వేసినట్లు బృందం సభ్యులు చెబుతున్నా దుకాణాల యజమానులు కోర్టు స్టే ఉన్నందున కొలతలు తీయొద్దని అడ్డుకుంటున్నారు.
ప్రధాన అడ్డంకులు ఇవే..
● మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం తమ భవనాలకు పరిహారం అందదని భూయజమానులు అసంతృప్తిగా ఉన్నారు.
● పాత ధరలకే భూములు తీసుకోవడంపై అభ్యంతరాలు తెలుపుతున్నారు.
● దుకాణం పోతే తమ కుటుంబానికి అంతే స్థాయిలో ఆదాయం వచ్చేలా ఆధారం చూపాలని వ్యాపారుల నుంచి డిమాండ్ ఉంది.
● రోడ్డు విస్తరణలో కొందరి ఇళ్లు 70 నుంచి 80 శాతం కోల్పోతుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
● తమకు జీవనాధారం చూపాలని రోడ్డును ఆనుకుని ఉన్న వ్యాపారులు, భవన యజమానులు కోరుతున్నారు.
న్యాయపోరాటంలో
నిర్వాసితులు..పునరావాసానికి ఓకే
వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు ప్రధాన రోడ్డును విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్పై దుకాణాలు కోల్పోతున్న నిర్వాసితుల హైకోర్టులో రిట్పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఇచ్చిన రెండు నోటిఫికేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా 10–4–2025 రోజున వాయిదా వేసిన ఉత్తర్వు కాపీని తమ దరఖాస్తుతోపాటు రెవెన్యూ డివిజనల్ అధికారి, భూసేకరణ అధికారి వేములవాడ ఆర్డీవోకు నిర్వాసితులు అందజేశారు. తమ షాపులు అప్పగిస్తున్నందుకు గుడిచెరువు కట్టకింద ఒక్కో యజమానికి ఒక్కో షాపు చొప్పున అప్పగిస్తూ పరిహారం చెల్లిస్తే ముందుకొచ్చేందుకు నిర్వాసితులు సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది.
రోడ్ల విస్తరణ స్వరూపం
నిధులు రూ.47 కోట్లకుపైగా
విస్తరించాల్సిన రోడ్డు ప్రధాన రహదారి
రోడ్డు వెడల్పు 80 ఫీట్లు
విస్తరణలో పోతున్న షాపులు 243
భూ యజమానులు 200
సేకరించాల్సిన స్థలం 8,200చదరపు గజాలు
నిర్వాసితులకు సరైన పరిహారం
80 ఫీట్ల రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం ద్వారా జీవో విడుదల చేయించాను దాని ప్రకారం సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా భూమి పూజ చేసుకున్నాం. ఈ ప్రక్రియ కోసం ఆయా శాఖలు కసరత్తు చేస్తున్నాయి. నిర్వాసితులను ఒప్పించి..మెప్పించి సరైన పరిహారం చెల్లించి పనులు ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుంది.
– ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్

రాజన్నా.. దారికొచ్చేనా !

రాజన్నా.. దారికొచ్చేనా !