మహనీయులను స్మరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మహనీయులను స్మరించుకోవాలి

Apr 12 2025 2:52 AM | Updated on Apr 12 2025 2:52 AM

మహనీయ

మహనీయులను స్మరించుకోవాలి

కరీంనగర్‌సిటీ: మహత్ములను నిత్యం స్మరించుకుంటూ వారి సూచించిన బాటలో నడవాలని శాతవాహన యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఉమేశ్‌కుమార్‌ తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గీతాభవన్‌ వద్ద మహాత్మా జ్యోతిబాపూలే పార్కు నుంచి యూనివర్సిటీ వరకు నిర్వహించిన ర్యాలీని శుక్రవారం ప్రారంభించారు. మహనీయుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య జాస్తి రవికుమార్‌ మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌ రామ్‌ పూలే, అంబేడ్కర్‌ గొప్ప దార్శనికులన్నారు. ర్యాలీలో విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు, జాతీయ సేవా పథకం వలంటీర్లు, ఆల్ఫోర్స్‌, వాగేశ్వరీ, ఎస్సారార్‌, ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల, సోషల్‌ వెల్ఫేర్‌, శ్రీ చైతన్య వివేకానంద, అక్షయ కళాశాల నుంచి అధ్యాపకులు ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఓఎస్‌డీ టు వీసీ హరికాంత్‌, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సుజాత, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.జయంతి, డా. పద్మావతి, శ్రీవాణి, రంగప్రసాద్‌, అబ్రరూల్‌ బాఖీ వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తాగునీటికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కథలాపూర్‌(వేములవాడ): కథలాపూర్‌కు చెందిన పల్లికొండ అజయ్‌(18) శుక్రవారం రాత్రి బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. అజయ్‌ తన స్నేహితుడితో కలిసి కథలాపూర్‌ గ్రామం నుంచి గుండు పెరమాండ్ల ఆలయం వైపు బైక్‌పై వెళ్తున్నారు. గ్రామశివారులో రోడ్డు పక్కన బైక్‌తోపాటు పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరో యువకుడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కోరుట్ల పట్టణంలోని ఆసుపత్రిలో చేర్పించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అజయ్‌ బైక్‌ను ఏదైనా వాహనం ఢీకొట్టడంతో ప్రమాదానికి గురయ్యారా? లేక అదుపు తప్పి పడిపోయారా అనే విషయాలపై పోలీసులు, గ్రామస్తులు ఆరా తీస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించి కారణాలు తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

భ్రూణహత్యలో నలుగురిపై కేసు

చందుర్తి(వేములవాడ): భ్రూణహత్యల ఘటనలో ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యం, ఆర్‌ఎంపీ,సదరు దంపతులపై శుక్రవారం కేసు నమోదైంది. డీఎంహెచ్‌వో రజిత తెలిపిన వివరాలు.. చందుర్తి మండలంలో విధులు నిర్వర్తిస్తున్న రేగుల రాజు భార్య నవ్యకు అబార్షన్‌ చేయించారు. ఇందుకు సహకరించిన మూడపల్లికి చెందిన ఆర్‌ఎంపీ అల్లె రాజు, అబార్షన్‌ చేసిన వేములవాడకు చెందిన నందిని ఆస్పత్రి యాజమాన్యంపై డీఎంహెచ్‌వో వేములవాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మాతృమూర్తి మనోవేదన

కట్టుకున్న భర్త మాటలు నమ్మి ఆ ఇల్లాలు ఐదు నెలల గర్భాన్ని తీయించుకుంది. భార్య కడుపులో పెరుగుతున్న శిశువుకు అవయవాలు పూర్తిగా రాలేదని, అంగవైకల్యంతో జన్మింఏ అవకాశం ఉందని నమ్మించిన భర్త ఆమెను అబార్షన్‌కు ఒప్పించాడు. భర్త మాటలు నమ్మి అబార్షన్‌ చేయించుకుంది. ఇప్పుడు ఆ మాతృమూర్తికి గర్భశోకంతోపాటు కేసు నమోదుకావడంతో ఆ తల్లి మనోవేదనకు అంతులేకుండా పోయింది.

భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అదనపు వరకట్నం కోసం భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ సిరిసిల్ల మొదటి అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి కె.సృజన శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్సై రమాకాంత్‌ తెలిపారు. మండలంలోని పోతిరెడ్డిపల్లికి చెందిన అడిగే మాధవికి చిన్నబోనాలకు చెందిన పడిగే తిరుపతితో 2007లో వివాహమైంది. ఆ సమయంలోనే రూ.4లక్షలు నగదు, ఐదు తులాల బంగారం, 30 తులాల వెండి, ఇతర సామగ్రి వరకట్నంగా ముట్టజెప్పారు. తర్వాత కొద్ది రోజులకు అదనపు వరకట్నం కోసం తిరుపతితోపాటు అత్తమామలు వేధించారు. వేధింపులు భరించలేక తల్లి గారింటికి రాగా.. భర్త తిరుపతి మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మాధవి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి.. నిందితుడు తిరుపతికి ఏడాది జైలు, రూ.వేయి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై వివరించారు.

మహనీయులను స్మరించుకోవాలి
1
1/1

మహనీయులను స్మరించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement