కేడీసీసీ బ్యాంక్‌లో దోపిడీకి యత్నం | - | Sakshi
Sakshi News home page

కేడీసీసీ బ్యాంక్‌లో దోపిడీకి యత్నం

Jun 20 2023 12:56 AM | Updated on Jun 20 2023 11:11 AM

దొంగతనంపై వివరాలు సేకరిస్తున్న పోలీసులు - Sakshi

దొంగతనంపై వివరాలు సేకరిస్తున్న పోలీసులు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్‌లో ఆదివారం రాత్రి దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న బ్యాంక్‌లోకి దొంగలు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జరిగిన సంఘటనపై ఎస్పీ అఖిల్‌మహాజన్‌ ఆరా తీశారు. బ్యాంక్‌ అధికారులు, సీఐ మొగిలి తెలిపిన వివరాలు. మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్‌ వద్ద భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పనులు చేసేందుకు భవనానికి తూర్పు వైపున పలంచ కొట్టారు.

దాని ద్వారా మొదటి అంతస్తుపైకి ఎక్కి.. అల్యూమినియం స్లైడింగ్‌ కిటికి నుంచి బ్యాంక్‌లోనికి ఇద్దరు దొంగలు ప్రవేశించారు. మొదట సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లను కట్‌ చేశారు. అనంతరం బ్యాంక్‌లో ఉన్న రెండు షెట్టర్లను ఇనుపరాడుతో పైకెత్తి స్ట్రాంగ్‌రూం లాకర్‌ను కట్టర్‌తో తెరిచేందుకు ప్రయత్నించారు. తెరుచుకోకపోవడంతో అక్కడే ఉన్న ఫైళ్లను చిందరవందరగా పడేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం బ్యాంక్‌ను తెరిచేందుకు వాచ్‌మెన్‌ అనిల్‌ వచ్చి పరిస్థితిని మేనేజర్‌ సంపూర్ణకు వివరించాడు.

మేనేజర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ మొగిలి, ఎస్సై ప్రేమ్‌దీప్‌, క్లూస్‌టీం సభ్యులు, సీసీఎస్‌ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. దొంగల వేలిముద్రలు సేకరించి, డాగ్‌స్క్వాడ్‌లతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీల ఆధారంగా బ్యాంక్‌లోకి ఇద్దరూ దొంగలు ప్రవేశించినట్లు సీఐ తెలిపారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు తలకు హెల్మెట్‌, చేతులకు గ్లౌస్‌లు ధరించారన్నారు. సీసీ పుటేజీల ఆధారంగా దొంగలను త్వరలోనే పట్టుకుంటామని వివరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

బ్యాంక్‌లో భద్రత చర్యలు
బ్యాంక్‌లో దొంగతనం జరిగినట్లు తెలుసుకున్న రవీందర్‌రావు హుటాహుటిన ఎల్లారెడ్డిపేటకు వచ్చారు. దొంగతనంపై మేనేజర్‌ సంపూర్ణ, సింగిల్‌విండో చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కృష్ణారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బ్యాంక్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉందని వినియోగదారులు, రైతులు ఆందోళనకు గురికావద్దని కోరారు. పూర్తి భద్రత వలయంలో బ్యాంక్‌ను నడిపిస్తున్నామని చెప్పారు. నూతన భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మధ్యాహ్నం నుంచి బ్యాంక్‌ లావాదేవీలు కొనసాగించారు. మేనేజర్‌ సంపూర్ణ, సిబ్బంది ఉన్నారు.

– రవీందర్‌రావు, టెస్కాబ్‌ చైర్మన్‌

స్ట్రాంగ్‌రూం డోర్‌ను కట్‌ చేసిన దొంగలు1
1/1

స్ట్రాంగ్‌రూం డోర్‌ను కట్‌ చేసిన దొంగలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement