మార్కాపురం: వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన విద్యావేత్త, దివంగత డాక్టర్ శామ్యూల్ జార్జి 20వ వర్ధంతి సందర్భంగా ’జార్జి స్మృతి2026’ ఘనంగా నిర్వహించారు. స్థానిక శామ్యూల్ జార్జి అటానమస్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలోని ‘జార్జి గ్రీన్స్’ సమాధి వద్ద ఆయనకు నివాళులర్పించారు. కళాశాల సాంకేతిక సలహాదారు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ విజయలక్ష్మి, అకడమిక్ అడ్వైజర్, వైఎస్సార్సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ హాజరై పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి ఉన్నత విద్యను చేరువ చేసిన మహనీయుడు శామ్యూల్ జార్జి అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సంస్థలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని, కళాశాల 30వ వసంతంలోకి అడుగుపెట్టడం, న్యాక్ – ఏ గ్రేడ్తో పాటు అటానమస్ హోదా దక్కడం గర్వకారణమన్నారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్జీఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ సయ్యద్ ఖాసిం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజాబాబు, డీన్ డాక్టర్ మస్తానయ్య, డాక్టర్ డేనియల్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
● ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
తాళ్లూరు: మండలంలోని బొద్దికూరపాడులో ఓ రెస్టారెంట్లో సప్లయర్గా పనిచేస్తున్న దళిత మహిళ మందా ఏసమ్మపై చీమకుర్తి మండలం దేవరపాలెం గ్రామానికి చెందిన గంగిరెడ్డి బాలిరెడ్డి అనే టీడీపీ నేత విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినాయక చవితి పండగ రోజు దేవరపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేత రెస్టారెంట్కు వచ్చి భోజనం తిన్నాడు. భోజనం పూర్తవడంతో సప్లయర్ ఖాళీగా ఉన్న కుర్చీలు తీస్తోంది. దళిత మహిళను ఏయ్ ఇటు రా.. ఇక్కడ కుర్చీలు తీయకు..అని చంపకు పెట్టి కొట్టి దాడి చేసినట్లు బాధిత మహిళ తెలిపింది. కులం పేరుతో బూతులు తిట్టి బీరు సీసాతో విచక్షణ రహితంగా దాడి చేశాడని వాపోయింది. గాయపడిన మహిళను కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు గంగిరెడ్డి బాలిరెడ్డిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న చీమకుర్తి వైఎస్సార్ సీపీ మాజీ కౌన్సిలర్ పాటిబండ్ల గంగయ్య వివరాలు తెలుసుకొని బాధితురాలిని పరామర్శించారు. ఆమెకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


