న్యూస్రీల్
వైఎస్సార్ సీపీ కసరత్తు...
పోరుకు కదలిక..
మార్కాపురం:
స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ఊపందుకుంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో సమీకరణాలపై దృష్టి సారిస్తున్నాయి. ఓటర్ల జాబితాల ప్రదర్శనతో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైనట్లయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో 925 గ్రామ పంచాయతీలు, 48 మండలాలు, 9,326 వార్డులు ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల జాబితాల పరిశీలన, ప్రదర్శనపై అధికారులు దృష్టి సారించారు.
జాబితాల పరిశీలనకు అవకాశం...
ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఓటర్ల జాబితాల ముసాయిదాలు ప్రదర్శిస్తున్నారు. గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల వివరాలను ప్రజలు పరిశీలించేందుకు అవకాశం కల్పించారు. తమ పేరు, కుటుంబ సభ్యుల వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకుంటున్నారు. తప్పులు, మార్పులు, అభ్యంతరాలుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మార్కాపురం జిల్లా పరిధిలో 7,50,261 మంది ఓటర్లున్నారు. 406 గ్రామ పంచాయతీలు, 4,058 వార్డులు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 10,70,902 మంది ఓటర్లున్నారు. 519 పంచాయతీల పరిధిలో 5268 వార్డులున్నాయి. ఓటర్ల ముసాయిదా విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. గ్రామాల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమకు అనుకూల పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ...
పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లు ఖరారైతే పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ గ్రామంలో ఏ సామాజికవర్గానికి రిజర్వేషన్ దక్కుతుందనే అంశంపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. స్థానిక ఎన్నికలు రాజకీయ పార్టీలకు గ్రామస్థాయిలో కీలకం కావడంతో నాయకులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఎక్కడ పోటీ తీవ్రంగా ఉంటుంది.. ఎవరికి అనుకూల పరిస్థితులున్నాయి.. గత ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి.. వంటి అంశాలపై చర్చిస్తున్నారు. గత పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ సీపీ గణనీయమైన ప్రభావం చూపింది. ఈసారి కూడా అన్ని స్థానాల్లో పోటీకి ఆ పార్టీ నాయకులు సన్నద్ధమవుతున్నారు.
షెడ్యూల్పై ఎదురుచూపు...
ఓటర్ల జాబితాల ప్రదర్శనతో స్థానిక ఎన్నికల ప్రక్రియలో కదలిక మొదలైంది. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమవుతుండగా.. రాజకీయ పార్టీలు గ్రామాల వారీగా బలాబలాలను బేరీజు వేసుకుంటున్నాయి. ఇక రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువడుతుందన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది.
ఒంగోలు, ఎస్ఎన్ పాడు, కందుకూరు, కొండపి, అద్దంకి మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ ఇప్పటికే కార్యకర్తల సమావేశాలు నిర్వహించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసింది. నియోజకవర్గ ఇన్చార్జిలు పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రిజర్వేషన్ ఏదైనా పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.


