చీమకుర్తి: స్థానిక ఎన్ఎస్పీ కాలనీ సమీపంలోని ఐరన్ స్క్రాప్, ప్లాస్టిక్ వేస్ట్ డంపింగ్ యార్డులో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయగా.. ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వెల్లంపల్లి రంగారావు అనే వ్యాపారి గ్రానైట్ క్వారీలు, పరిసర ప్రాంతాల నుంచి పాత ఇనుప సామగ్రి, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఖాళీ ఆయిల్ డబ్బాలు సేకరించి ఎన్ఎస్పీ కాలనీ సమీపంలో డంప్ చేస్తుంటాడు. అక్కడి నుంచి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటాడు. యార్డులో ఇనుప రాడ్లను కట్ చేస్తుండగా ఎగిసిపడిన నిప్పురవ్వలు డ్రమ్ముల్లోని మడ్డి ఆయిల్కు అంటుకున్నాయి. దీంతో క్షణాల్లో మంటలు డంపింగ్ యార్డు అంతటా, పక్కనే ఉన్న షెడ్డుకు వేగంగా విస్తరించాయి. మంటల తీవ్రతకు ఆయిల్ నిల్వ ఉన్న డ్రమ్ములు భారీ శబ్దంతో పేలి గాలిలోకి ఎగిరిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో సమీప ఇళ్లలోని ప్రజలు తీవ్ర భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు. చీమకుర్తి–ఒంగోలు ప్రధాన రహదారి పక్కనే ప్రమాదం చోటుచేసుకోవడంతో అటుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర వాహనాల ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాద స్థలాన్ని చీమకుర్తి సీఐ దాసరి ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి పరిశీలించి వివరాలు సేకరించారు.
క్రెడిట్ చోర్
చంద్రబాబు సర్కార్
మంటల ధాటికి పేలిన ఆయిల్ డ్రమ్ములు
దట్టమైన పొగతో స్థానికుల్లో భయాందోళన
చీమకుర్తి ఎన్ఎస్పీ కాలనీలో ఘటన త్రుటిలో తప్పిన ప్రాణనష్టం


