ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించాలి కలెక్టర్ను ఆదేశించిన ఎన్నికల సంఘం అధికారులు
ఒంగోలు సబర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ పి.రాజా బాబుతో రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్ సీట్లను నిర్ణయించాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల సర్వే సమర్థంగా పూర్తి చేయాలన్నారు. తదుపరి సీట్లను నిర్ధారించాలన్నారు. ఎన్నికల సామగ్రి కొనుగోలు చేపట్టాలన్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికల సామగ్రి కేటాయింపు ఉంటుందని, మిగతావి స్థానికంగా కొనుగోలు చేయాలని, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందస్తుగా గుర్తించి, బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. బ్యాలెట్ బాక్సులు సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ముందస్తుగానే ఏర్పాటు చేసుకోవాలని పలు సూచనలు చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలకాగానే అభ్యంతరాలు స్వీకరించి, తుది జాబితాకు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు అనుసరించి గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానిక సభ్యుల ఎన్నికల ఏర్పాట్లకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు ఉత్పన్నం గాకుండా ప్రణాళికతో అధికారులు పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. సమావేశంలో కలెక్టర్ పి.రాజాబాబు, జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి, డీపీఓ అనుపమ, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ బాలమ్మ, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.


