● అధికారులను సైతం లెక్కచేయని అక్రమ మట్టి తరలింపు
మార్కాపురం రూరల్: అధికార పార్టీ నాయకుల అండతో మండలంలోని పెద్ద యాచవరం గ్రామంలో చెరువులో నుంచి మట్టిని యథేచ్ఛగా బయటకు తరలిస్తున్నారు. అధికారులను సైతం లెక్కచేయకుండా అక్రమ మట్టి తరలింపు కొనసాగుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో భారీ యంత్రాలతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా సంబంధిత అధికారులు అడ్డుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చెరువు పరిరక్షణను పూర్తిగా విస్మరించి మట్టి దోపిడీ సాగుతుండటంతో భవిష్యత్తులో చెరువు స్వరూపం దెబ్బతింటుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి తరలింపును ప్రశ్నించిన గ్రామస్తులతో నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ‘‘మా పార్టీ అధికారంలో ఉంది... ఏం చేసుకుంటారో చేసుకోండి...మీకు తోచిన అధికారికి చెప్పుకోండి’’ అంటూ బహిరంగంగానే సవాల్ విసిరినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రజల ఫిర్యాదులు, అధికారులని సైతం పట్టించుకోకుండా మట్టి తరలింపు కొనసాగుతుండటం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. వెంటనే రెవెన్యూ, గనుల శాఖ అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను నిలిపేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


