● నేలమట్టంలో ఉన్న భవనాన్ని పైకిలేపి ఎత్తు పెంచుతున్న ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థ
చీమకుర్తి: ఎప్పుడో తాతలు, తండ్రుల కాలంలో కట్టిన ఇళ్లు కాలక్రమంలో నేలమట్టంలో ఉంటుంటాయి. దీని వలన వర్షం నీరు లోనికి చేరడం వంటి సమస్యతో పాటు వాస్తుపరంగా కూడా సమస్యగా భావిస్తుంటారు. చీమకుర్తికి చెందిన గోవిందరెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పల్లంలో ఉన్న తన ఇంటి ఎత్తు పెంచేందుకు హైదరాబాద్కు చెందిన ట్రయాంగిల్ హౌస్ లిఫ్టింగ్ సంస్థ సివిల్ ఇంజినీర్ నాగేంద్రబాబును సంప్రదించారు. వారు కొద్ది రోజుల క్రితం పని ప్రారంభించారు. హైడ్రాలిక్ జాకీలతో ఆ ఇంటిని దాదాపు 5 అడుగులు పైకి లేపారు. పాత పునాది స్థానంలో కొత్త పునాది కూడా నిర్మిస్తున్నారు. తన సంస్థ ద్వారా ఇప్పటికే మొత్తం 300 భవనాలకుపైగా పైకిలేపినట్లు నాగేంద్రబాబు తెలిపారు.
సంతమాగులూరు (అద్దంకి): వివాహేతర సంబంధం నేపథ్యంలో సంతమాగులూరు మండలంలోని పాతమాగులూరు గ్రామంలో ఈ నెల 16వ తేదీ జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శేషగిరిరావు ఆ వివరాలు వెల్లడించారు. పాతమాగులూరు గ్రామానికి చెందిన హతుడు సజ్జల పిచ్చిరెడ్డి నాలుగు సంవత్సరాలుగా నిందితుడు చల్లా విష్ణువర్దన్ తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనిపై పిచ్చిరెడ్డిని, తన తల్లిని అనేకసార్లు విష్ణువర్దన్ మందలించాడు. గతంలో రెండుసార్లు పిచ్చిరెడ్డితో గొడవపడ్డాడు. ఈ నెల 16వ తేదీ 4 గంటల సమయంలో సూళ్లూరుపేట నుంచి వచ్చి ఇంటికివెళ్లిన విష్ణువర్దన్.. తన తల్లితో కలిసి ఉన్న పిచ్చిరెడ్డి పై ఆగ్రహంతో దాడి చేశాడు. ప్రాణభయంతో పారిపోతున్న పిచ్చిరెడ్డిని పాతమాగులూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న రామాంజనేయ సెల్షాప్ వరకు వెంబడించి మరీ అక్కడున్న ఇటుక రాయితో నుదుటిపై విచక్షణారహితంగా కొట్టాడు. తీవ్రగాయాలపాలైన పిచ్చిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం అడ్డరోడ్డు ప్రాంతంలో విష్టువర్దన్ను అరెస్టు చేశారు. అతన్ని అద్దంకి కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.


