రాష్ట్రాన్ని అమ్మడమే బాబు విజన్
ఒంగోలు టౌన్: రాష్ట్రాన్ని అమ్ముకోవడమే చంద్రబాబు విజన్ అని, అధికారంలోకి వచ్చినపుడల్లా రాష్ట్రాన్ని అమ్మడమే తప్ప ప్రజలకు ఆయన చేసిన మేలేమీ లేదని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుతో మాట్లాడి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని, చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే శిష్యుడు రేవంత్రెడ్డి మాటకే ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వడు కానీ రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి మనకు రావాల్సిన వాటాలను రేవంత్రెడ్డిని చంద్రబాబు ఎందుకు అడగడం లేదని నిలదీశారు.
భోగాపురం ఎయిర్పోర్టును నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 2023లో శంకుస్థాపన చేశారని, శంకుస్థాపన వేదిక నుంచే జీఎమ్మార్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ 2026 నాటికి విమానాశ్రయం పూర్తి చేస్తానని చెప్పారని గుర్తు చేశారు. ఆ వీడియోలే లేకుంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ప్రజల కళ్లకు గంతలు కట్టేవాళ్లన్నారు. సోషల్ మీడియా ఉండటం వల్లే ఎల్లో మీడియా కుట్రలు సాగలేదన్నారు. చంద్రబాబు అబద్ధాలన్నీ బయటపడుతున్నాయని చెప్పారు. మన జిల్లాకు సంబంధించి రామాయపట్నం పోర్టు కూడా పూర్తి కావచ్చిందని, నాలుగు పోర్టులు, హార్బర్లు పూర్తవుతున్నాయని చెప్పారు. మెడికల్ కాలేజీలను కాపాడుకోవడానికి ప్రజలంతా కోటి సంతకాలు చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సుదీర్ఘకాలం పరిపాలించిన చంద్రబాబు రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని కనిపించిన వారికల్లా చెబుతుంటాడని, కానీ ఒక్క పోర్టు కట్టడానికి ఆయనకు ప్రాణం ఒప్పలేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చినపుడల్లా రాష్ట్రాన్ని అమ్ముకోవడం, పరిశ్రమల పేరుతో పేదల భూములు లాక్కోవడం, విద్య వైద్యాన్ని దెబ్బతీయడం చంద్రబాబుకు అలవాటైపోయిందని మండిపడ్డారు. మళ్లీ అఽధికారంలోకి రామన్న నమ్మకంతోనే ఎకరం 99 పైసలకే కోట్లాది రూపాయల విలువైన భూములను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నాడని ధ్వజమెత్తారు. టాటా, లూలూ కంపెనీలు వేలంలో భూములు కొనలేవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్తో దోస్తి చేస్తుందని, ఢిల్లీలో బీజేపీతో చేతులు కలుపుతుందని, ఇదేం ద్వంద నీతని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తికి పవర్ స్టార్ ఎలా వత్తాసు పలుకుతున్నారని ప్రశ్నించారు. పవర్స్టార్కు సినిమా వ్యాపారానికంటే రాజకీయాలే మంచి లాభసాటిగా ఉన్నట్లుందని విమర్శించారు. ఆయన శాఖలో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తూ చిడతలు పట్టుకొని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.
మెప్మాపై ఎమ్మెల్యేకు కోపం ఎందుకు...
ఒంగోలు మెప్మాలో జరిగిన అక్రమాల గురించి 15 రోజుల్లో విచారణ నివేదిక ఇస్తామన్నారు. నెల రోజులు దాటినా ఇప్పటికీ నివేదిక ఎందుకు ఇవ్వలేదని చుండూరి రవిబాబు ప్రశ్నించారు. బినామీ రుణాల గురించి ఎమ్మెల్యే జవాబు చెబుతారని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అవినీతి చేసిన వారి గురించి తేల్చకుండా అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటే ప్రయోజం ఏంటన్నారు. అవినీతికి పాల్పడిన వారి వివరాలను వెల్లడించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహ గౌడ్, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కంటే శిష్యుడు రేవంత్రెడ్డి మాటకే అధిక ప్రాధాన్యం
టాటా, లూలూ యాజమాన్యాలు భూములు కొనలేని దుస్థితిలో ఉన్నాయా..?
ఎకరా భూమిని 99 పైసలకే కట్టబెట్టడం దేనికి
చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క పోర్టూ ఎందుకు కట్టలేకపోయారు..?
వైఎస్సార్ సీపీ ఒంగోలు ఇన్చార్జి
చుండూరి రవిబాబు ధ్వజం


