జర్నలిస్టులు, ప్రజలే బీఆర్‌ఎస్‌కు టార్గెట్‌  | YSRTP Chief YS Sharmila Slams BRS Party | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులు, ప్రజలే బీఆర్‌ఎస్‌కు టార్గెట్‌ 

Feb 5 2023 3:19 AM | Updated on Feb 5 2023 7:43 AM

YSRTP Chief YS Sharmila Slams BRS Party - Sakshi

పర్వతగిరి: బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రస్తుతం జర్నలిస్టులు, ప్రజలే టార్గెట్‌గా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీలు, పోలీసులు, ఇతర వర్గాలకు చెందిన వారు ఆ పార్టీకి అమ్ముడుపోయారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చని సమయంలో వాటిని ఎత్తిచూపుతున్న ఏకైక వ్యక్తిగా తానే ఉన్నానన్నారు. తనను అడ్డు తొలగించుకునేందుకు పర్వతగిరిలో దాడులు నిర్వహించినా.. వారిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు. పోలీసులు పూర్తిగా బీఆర్‌ఎస్‌ పార్టీకి అమ్ముడుపోయారని, దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఇప్పటివరకు నోరు మెదపడం లేదన్నారు.

వారు అన్ని రంగాల్లో వాటా తీసుకుంటున్నారని, కమీషన్లకు కక్కుర్తిపడి ప్రతిపక్ష హోదాను మర్చిపోయారన్నారు. వాటిని ఎత్తిచూపుతున్న మీడియా, సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నారన్నారు. అలాంటి దాడులకు భయపడేది లేదని, దాడులు చేస్తే ప్రతిదాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌ టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చల్లా అమరేందర్‌రెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాడెం శాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement