విద్యార్థుల జీవితాలతో ఆటలా చంద్రబాబు.. కూటమి ప్రభుత్వంపై రవిచంద్ర ఫైర్‌ | YSRCP Student Wing Working President Ravichandra slams chandrababu government | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జీవితాలతో ఆటలా చంద్రబాబు.. కూటమి ప్రభుత్వంపై రవిచంద్ర ఫైర్‌

Jun 16 2025 3:11 PM | Updated on Jun 16 2025 4:16 PM

YSRCP Student Wing Working President Ravichandra slams chandrababu government

సాక్షి,తాడేపల్లి: గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, ఈ ఏడాది కూడా అరకొర నిధులు ప్రకటించిన టీడీపీ కూటమి ప్రభుత్వం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయకుండా, వారి జీవితాలతో ఆడుకుంటోందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర ఆక్షేపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎ.రవిచంద్ర హెచ్చరించారు.

ప్రెస్‌మీట్‌లో ఎ.రవిచంద్ర ఇంకా ఏం మాట్లాడారంటే..:విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలు: విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇంతవరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు జమ చేయలేదు. ఫీజు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నాయి. మరోవైపు దీనిపై ఇప్పటికే సమావేశమైన ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. ఇందులో అధికార పార్టీ నాయకులకు చెందిన కాలేజీలు కూడా ఉన్నాయి. 

విద్యార్థుల తరఫున చెల్లించాల్సిన ఫీజుకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్, ఆ మాట నిలబెట్టుకోకుండా.. ఏడాది పాలన ఘనతలంటూ డప్పుకొట్టుకోవడం దారుణం. వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఐదేళ్ల కాలంలో అమలు చేసిన విద్యా సంస్కరణలను ఏడాదిలోనే నాశనం చేశారు. విద్యార్థులకు విద్యాదీవెన కిట్లు కూడా సకాలంలో అందని పరిస్థితి నెలకొంది. పరీక్షలు కూడా విజయవంతంగా నిర్వహించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ప్రైవేటు ఎయిడెడ్‌ కాలేజీల భూములపై కన్నేసి కాజేయడానికి టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. పిల్లల చదువులను ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవడం లేదు.

విద్యార్థుల బకాయిలు రూ.6,400 కోట్లు: 2024 ఏప్రిల్‌ నుంచి 2025 జూన్‌ 16 నాటికి ఆరు త్రైమాసికాలకు సంబంధించి విద్యార్థులకు ప్రభుత్వం రూ.6,400 కోట్లు బకాయి పడింది. అందులో రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాగా, రూ.2,200 కోట్లు స్కాలర్‌షిప్‌ బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తం ఎప్పటిలోపు చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. 

ఫీజు బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల చేయని కారణంగా పేద విద్యార్థులు చదువులు మధ్యలోనే ఆపేయాల్సిన దుస్థితి నెలకొంది. కొందరు విద్యార్థులు ఫీజులు కట్టుకోవడం కోసం కూలీ పనులకు వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక క్వార్టర్లీ ఫీజు చెల్లింపు విధానాన్ని రద్దు చేసి హాఫ్‌ ఇయర్లీ విధానం తీసుకొచ్చారు. తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీల ఖాతాల్లోనే విద్యార్థుల ఫీజులు జమ చేస్తామని చెప్పారు. రెండుసార్లు గడువు పూర్తయినా విద్యార్థుల తరఫున ప్రభుత్వం ఫీజులు జమ చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయి. పరీక్షలప్పుడు హాల్‌ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో అంగీకార పత్రాలు రాయించుకుని వారిని పరీక్షలకు పంపించిన దుస్థితికి రాష్ట్ర విద్యావ్యవస్థను తీసుకెళ్లారు.

అబద్ధాలు చెబుతున్న ప్రభుత్వం: రెండు క్వార్టర్ల ఫీజు చెల్లించామని ఈ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. వాస్తవానికి ఏడాది కాలంలో కేవలం ఒకటిన్నర క్వార్టర్‌ ఫీజును మాత్రమే జమ చేసింది. ఒక క్వార్టర్‌ పూర్తిగా ఇచ్చి ఇంకో క్వార్టర్‌ సగం మాత్రమే చెల్లించి రూ.300 కోట్లు పెండింగ్‌ పెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఏటా రూ.2,800 కోట్లు, స్కాలర్‌షిప్‌ కింద మరో రూ.1,100 కోట్లు.. అలా ఏటా మొత్తం రూ.3,900 కోట్ల చొప్పున రెండేళ్లకు కలిపి రూ.7800 కోట్లు చెల్లించాలి. కానీ కూటమి ప్రభుత్వం ఒకటిన్నర క్వార్టర్‌ ఫీజు మాత్రమే చెల్లించి రూ.6400 కోట్లు పెండింగ్‌ పెట్టింది. ఈ ఏడాది బడ్జెట్‌లో అరకొరగా రూ.2,600 కోట్ల కేటాయింపు చూపినా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా విద్యార్థుల చదువులను గాలికొదిలేసింది.

ఫీజు రియంబర్స్‌మెంట్‌ నిధులు వెంటనే విడుదల చేయాలి: రవిచంద్ర

ఐదేళ్లలో రూ.18 వేల కోట్లు చెల్లించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం: గత వైస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి త్రైమాసికానికి రూ.720 కోట్ల చొప్పున ఎప్పటికప్పుడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమయ్యేది. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో నిధులు ఎప్పుడు జమ చేసేది కూడా పత్రికల ద్వారా నాటి జగన్‌ ప్రభుత్వం స్పష్టంగా చెప్పడంతో విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా ఐదేళ్ల చదువులు సాఫీగా సాగిపోయాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పేద పిల్లల చదువులను సమస్యలు చుట్టుముట్టాయి. గతంలో ఏ కాలేజీ యాజమాన్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల కోసం ఎదురు చూసిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక కాలేజీల యాజమాన్యాలు మూడుసార్లు మంత్రి నారా లోకేష్‌ని కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల చేయాలని కోరినా ఫలితం లేదు. 

2019–24 మధ్య విద్యాదీవెన కింద 29,65,930 మంది విద్యార్థులకు రూ.12,608 కోట్లు, వసతి దీవెన కింద రూ.4,276 కోట్లు చెల్లించారు. మొత్తంగా 54,83,175 మంది పిల్లలకు 5 ఏళ్లలో రూ.16 వేల కోట్లకు పైగా చెల్లించారు. దీంతోపాటు 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,778 కోట్లు కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించింది. పిల్లల చదువుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలన్నీ విడుదల చేయాలని, లే పక్షంలో విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఎ.రవిచంద్ర హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement