‘తప్పుడు వివాదాన్ని సృష్టించిన వారంతా క్షమాపణలు చెప్పాలి’ | YSRCP MLC Varudu Kalyani Takes On TDP Govt | Sakshi
Sakshi News home page

‘తప్పుడు వివాదాన్ని సృష్టించిన వారంతా క్షమాపణలు చెప్పాలి’

Jun 13 2025 6:30 PM | Updated on Jun 13 2025 7:57 PM

YSRCP MLC Varudu Kalyani Takes On TDP Govt

తాడేపల్లి: సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్‌పై సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహిళలను కించపరిచారంటూ లేని దానిని ఆపాదిస్తూ కూటమి పార్టీల నేతలు తాము చేసిన బురద రాజకీయంకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టించాలనుకుంటే కుదరదనే విధంగా సుప్రీంకోర్ట్ తీర్పు ప్రజాస్వామిక స్పూర్తిని నిలబెట్టిందని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే...

‘ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, పత్రికాస్వేచ్ఛను పరిరక్షిస్తూ సుప్రీంకోర్ట్ కొమ్మినేని అరెస్ట్‌పై ఇచ్చిన ఉత్తర్వులను ప్రజలు స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. వారి సొంత రెడ్‌బుక్ రాజ్యాంగాలు చెల్లవు, భారత రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా పాలన చేయాలని మరోసారి సుప్రీంకోర్ట్ తన తాజా ఉత్తర్వులతో చెప్పినట్లయ్యింది. ఏపీలో ఏడాది పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదు. 

అమరావతి పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి తెగబడ్డారు. తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్, సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులతో ఒక అరాచకాన్ని సృష్టించారు. అటువంటి భయానక పరిస్థితుల్లో ప్రజాస్వామిక స్పూర్తిని పరిరక్షిస్తూ సుప్రీంకోర్ట్ ఈ రోజు వెలువరించిన తీర్పు చంద్రబాబు అరాచకాలకు గొడ్డలిపెట్టు. గడిచిన మూడు రోజులుగా మహిళలను అవమానించారనే వక్రీకరణలను ఆపాదిస్తూ వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి భారతమ్మ, సాక్షి మీడియా పైనా, సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపైనా చేసిన దుష్ప్రచారం, కూటమి ప్రభుత్వ కుట్రలు సుప్రీంకోర్ట్ ఉత్తర్వులతో మొత్తం దేశమంతా తెలిసింది. 

ఇటువంటి దుర్మార్గానికి పాల్పడిన వారంతా వైఎస్‌ జగన్, వైఎస్‌ భారతమ్మకు క్షమాపణలు చెప్పాలి. ఈ వివాదాన్ని రెచ్చగొట్టేలా చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఇప్పటికైనా సుప్రీంకోర్ట్ ఉత్తర్వులతో తన బుద్ది మార్చుకోవాలి. బాధ్యతాయుతమైన మహిళా మంత్రులు పోలీస్ స్టేషన్‌లకు వెళ్ళి ఫిర్యాదులు ఇచ్చి, తప్పుడు కేసులు బనాయించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారు. ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడినందుకు వారు తమ పదవులకు రాజీనామా చేయాలి’ అని ఆమె డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement