మహిళల రక్షణ ఇలాగేనా!?: వరుదు కల్యాణి | YSRCP Leader Varudhu Kalyani Fires On Home Minister Anitha | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణ ఇలాగేనా!?: వరుదు కల్యాణి

Jul 11 2024 5:47 AM | Updated on Jul 11 2024 10:42 AM

బాధిత కుటుంబాన్ని ఓదారుస్తున్న కల్యాణి, సుభద్ర

బాధిత కుటుంబాన్ని ఓదారుస్తున్న కల్యాణి, సుభద్ర

బాలిక హత్యోదంతంపై చలనంలేని హోంమంత్రి 

వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఫైర్‌

అచ్యుతాపురం: పదమూడేళ్ల బాలిక దర్శినిని దారుణంగా హత్యచేసిన నిందితుడు సురేష్‌ను వెంటనే పట్టుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లేపల్లి సుభద్ర డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం వారిరువురు రాంబిల్లి మండలం  కొప్పుగొండుపాలెంలోని దర్శిని ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను  ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన లేఖను డీఎస్పీకి అందజేశారు. 

పోలీసుల వైఫల్యం కాదా.. 
అనంతరం.. కళ్యాణి, సుభద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర హోంమంత్రి అనిత సొంత జిల్లాకు చెందిన బాలికను హత్యచేసి ఐదురోజులైనా నిందితుడ్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. బెయిల్‌పై ఉన్న నిందితుడు సురేష్‌ నుంచి ప్రాణహాని ఉందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా బాలికను రక్షించలేకపోవడం బాధాకరమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళా చట్టాలు, మహిళల రక్షణ గురించి మాట్లాడిన అనిత ఇప్పుడేం చేస్తున్నారని.. మహిళల రక్షణ ఇలాగేనా అని వారు ప్రశ్నించారు. 



ఇప్పటివరకూ బాలిక కుటుంబీకుల్ని పరామర్శించేందుకు హోంమంత్రి రాకపోవడం దారుణమన్నారు. దిశ యాప్, దిశ పోలీస్‌స్టేషన్లను మార్చడంలో ఉన్న శ్రద్ధ మహిళలను రక్షించడంలో ఎందుకు లేదన్నారు. మృతురాలి కుటుంబీకులకు ప్రభుత్వం రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని  డిమాండ్‌ చేశారు.  బాలిక హత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలన్నారు.  వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement